టీమిండియా మాజీ దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనికి చెందిన క్రికెట్ అకాడమీని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి శుక్రవారం హైదరాబాద్లో తమ కార్యకలపాలను ప్రారంభించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో పాటు పల్లవి విద్యా సంస్థలతో ధోని అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో శుక్రవారం జరిగిన మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ(ఎంసీడీసీఏ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి సమక్షంలోనే ఎంఎస్డీసీఏతో రెండేళ్ల కాలానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, పల్లవి విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య, మిహిర్ దివాకర్లు మార్చుకున్నారు.
క్రికెటర్ కావాలనే ఆశయమున్న పిల్లలు, యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మెరుగైన శిక్షణ అందించాలనే ఏకైక ఉద్దేశంతో ‘ఎంఎస్డీసీఏ’ను స్థాపించినట్టు ఆ సంస్థ ఎండీ మిహిర్ చెప్పారు. దేశంలోని ప్రతిభ గల క్రికెటర్లకు ప్రణాళికబద్దమైన శిక్షణ అందించాలనేది తమ అభిమతమని అన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పల్లవి, డీపీఎస్ విద్యాసంస్థలతో కలిసి హైదరాబాద్, దాని చుట్టు పక్కల పది అకాడమీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. తొలిదశలో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ఈ నెలాఖరు నుంచి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
డీపీఎస్ నాదర్గుల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ గండిపేట, బోడుప్పల్లో వచ్చే నెల నుంచి అకాడమీలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా అకాడమీలు తెరిచే ఆలోచనలు ఉన్నామని చెప్పారు. ఎంఎస్డీసీఏ కోచింగ్ మాడ్యూల్ను ధోనీ సూచనలు మేరకు ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తుంటాం. ధోనీ అనుమతి తీసుకున్నాకే కోచింగ్ మాడ్యూల్ను అకాడమీల్లో ప్రవేశపెడతాం’ అని మిహిర్ తెలిపారు. మరి మన రాష్ట్రంలో ధోని అకాడమీలు నెలకొల్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.