టీమిండియా, ఆర్సీబీ మాజీ కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ వేలంలో పాల్గొంటే పోటీ మామూలుగా ఉండదు. అతన్ని దక్కించుకోవడానికి అన్ని ఫ్రాంచైజ్లు కోట్లు కుమ్మరిస్తాయి. కానీ విరాట్ ఆర్సీబీని అంటిబెట్టుకుని ఉండడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. ఒకవేళ కోహ్లీ వేలంలోకి రావాలనుకున్నా ఆర్సీబీ అతడిని రిలీజ్ చేస్తుందా అనేది ప్రశ్న..? కానీ ఇది కుదరదు ఎందుకంటే.. విరాట్, ఆర్సీబీది గట్టిబంధమని స్వయంగా కోహ్లీనే ప్రకటించాడు. ఇతర ఫ్రాంచైజీలు వేలంలో పాల్గొనాలని కోరినప్పుడు కోహ్లీ ఆర్సీబీతోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్వయంగా వెల్లడించాడు. ఐపీఎల్ 2021లో ఆర్సీబీ కెప్టెన్గా కోహ్లీ తప్పుకున్న తర్వాత కోహ్లీని చాలా ఫ్రాంచైజీలు సంప్రదించాయి. వేలంలోకి రావాలని కోరాయి. కానీ కోహ్లీ తిరస్కరించాడు.
8 ఏళ్ల పాటు RCBకి కెప్టెన్గా వ్యవహరించిన కోహ్లి తన పోడ్కాస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. 33 ఏళ్ల విరాట్ కోహ్లి RCB కోసం అనేక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడాడు. అయితే ఈ జట్టు ఐపీఎల్ టైటిల్ను ఎప్పుడూ గెలవలేకపోయింది. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ‘ఆర్సీబీ నా జీవితంలో ఒక భాగం. నాకు చాలా ప్రత్యేకమైనది. చాలా అవకాశాలు వచ్చాయి కానీ ఎవ్వరినీ నమ్మలేను’ అన్నాడు. అంతకుముందు ఐపీఎల్లో ఆడిన ఓ మ్యాచ్ గురించి కోహ్లీ ప్రస్తావించాడు. అందులో తాను ఇప్పటికి ఆ ఓటమిని మర్చిపోలేనని చెప్పాడు. ఆ మ్యాచ్ IPL 2016లో ఫైనల్. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్లో జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో 8 పరుగుల తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. మరి కోహ్లీ, ఆర్సీబీ బంధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.