టీమిండియా ప్రస్తుతం ఫుల్ బిజీ షెడ్యూల్లో ఉంది. ఒక జట్టు ఇంగ్లాండ్, రెండో జట్టు ఐర్లాండ్ టూర్లకు వెళ్లాయి. అయితే టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మాత్రం ఈ సిరీస్ లలో లేడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ కు ముందు గాయంతో తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా ఆ గాయం నయం కాకపోవడంతో కేఎల్ రాహుల్ మెరుగైన చికిత్స కోసం జర్మనీకి వెళ్లాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షల అనంతరం మెరుగైన చికిత్స కోసం జర్మీనీకి పంపినట్లు తెలుస్తోంది. బెర్లిన్ లో ల్యాండ్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో బ్లెస్సింగ్స్ కావాలంటూ ఫోటోలు షేర్ చేశాడు.
కేఎల్ రాహుల్ ఐపీఎల్-2022 సీజన్లోనే గజ్జల్లో గాయం అయినట్లు తెలుస్తోంది. కాకపోతే అప్పుడు అది అంత తీవ్రంగా లేకపోవడంతోనే సిరీస్ కొనసాగించినట్లు చెబుతున్నారు. సౌత్ ఆఫ్రికా సిరీస్ సమయానికి ఆ గాయం తీవ్రం కావడంతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ గాయం కారణంగానే ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్లకూ దూరమయ్యాడు. అయితే రాహుల్ ఇంగ్లాండ్ తో సిరీస్ కు అందుబాటులోకి వస్తే బావుంటుందని బీసీసీఐ కూడా భావిస్తోంది. అందుకే మెరుగైన చికిత్స కోసం రాహుల్ ను హుటాహుటిన జర్మనీకి పంపినట్లు తెలుస్తోంది.
ఇప్పుడు జర్మనీలో తీసుకునే చికిత్స ద్వారా రాహుల్ కు గజ్జల్లో గాయం పూర్తిగా నయమవుతుందని చెబుతున్నారు. ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ లు పక్కన పెడితే ఆ తర్వాత వెంటనే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. మరి వెస్టిండీస్ తో సిరీస్కైనా రాహుల్ అందుబాటులోకి వస్తాడా అంటూ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే కేఎల్ రాహుల్ గాయాల కారణంగా సిరీస్ లను తప్పుకోవడం ఇదేం కొత్తకాదు. గతంలో కండరాల నొప్పితో న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంకతో టెస్టు, టీ20 వంటి సిరీస్లకు దూరం అయ్యాడు. మణికట్టు గాయంతో ఆస్ట్రేలియాతో సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాహుల్ త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. వెస్టిండీస్ తో సిరీస్ కు రాహుల్ అందుబాటులోకి వస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.