స్పోర్ట్స్ డెస్క్- కరోనా మహమ్మారి అంతకంతకు విస్తరిస్తోంది. ఐతే కరోనా ముషుల మీదే కాదు క్రికెట్ పైనా కాటు వేస్తోంది. కొవిడ్ సమయంలో క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని అందిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ కరోనా కాటుకు బలైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన చాలా మంది ఆటగాళ్లకు కరోనా సోకింది. దీంతో ఆటగాళ్లు ఒక్కొక్కరుగా మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నారు. ఈ పరిణామాలన్నింటినీ సమీక్షించిన బీసీసీఐ వెంటనే అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్కు ఫుల్ స్టాప్ పెట్టాలని కీలక నిర్ణయించుకుంది. ఐపీఎల్ 14ను రద్దు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈమేరకు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా కాసేపటి క్రితం ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ ఐపీఎల్ సీజన్లో ఇంకా 30కి పైగా మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. కోవిడ్ కేసులు ఉదృతి, గ్లోబల్ క్రికెట్ క్యాలెండర్ ను బట్టి ఐపీఎల్ మ్యాచ్లను రీ షెడ్యూల చేసే అవకాశమున్నట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచకప్ తర్వాత ఐపీఎల్-14 మిగతా మ్యాచ్ లను కొనసాగించవచ్చని సమాచారం. ఇప్పటికే పలు ఐపీఎల్ కు చెందిన ఫ్రాంఛైజీల ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్కు చెందిన ఆటగాడు వృద్ధిమాన్ సాహా కూడా కరోనా బారిన పడ్డాడు. మొత్తానికి ఐపీఎల్ అర్దాంతరంగా రద్దు కావడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.