ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీతో బ్యాంక్ సేవలు బాగా సులభతరం అయ్యాయి. అలాగే ఆన్ లైన్ మోసాలు కూడా బాగా పెరిగిపోయాయి. అయితే అంతా ఏదో చదువురాని వాళ్లని, పల్లెటూర్లలో ఉండే వృద్ధులను మోసం చేస్తారని అంతా అనుకుంటారు. అయితే టెక్నాలజీ, సాఫ్ట్ వేర్లు, సరిపడినంత స్టాఫ్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐసీసీలాంటి సంస్థను మోసం చేశారంటే నమ్ముతారా? అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు మోసం చేశారు. అదికూడా దాదాపు రూ.20 కోట్లకు టోకరా వేశారు. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది.
ఆన్ లైన్ మోసాలకు పాల్పడేవారు. రోజురోజుకీ కొత్త దారులను వెతుకుతున్నారని ఈ సంఘటన చూస్తే తెలిసిపోతుంది. దుబాయ్ లో ఉండే ఐసీసీకి చెందిన క్రికెట్ గవర్నింగ్ బాడీకి వాళ్లు ఓ ఆన్ లైన్ మోసగాళ్ల ముటాకి చిక్కారని మొన్న గురువారం వరుకు కూడా తెలియదు. వారికి తెలియకుండానే నాలుగుసార్లు మొత్తం 2.5 మిలియన్ డాలర్లు కోల్పోయారు. మోసగాళ్లు తాము ఐసీసీ వెండర్ అని వారిని నమ్మించాడు. అందుకు ఐసీసీతో సంప్రదింపులు జరిపే ఇ-మెయిల్ కి దగ్గరగా ఉండేలా ఓ ఫేక్ ఇ-మెయిల్ క్రియేట్ చేశారు. దాని ద్వారా వాళ్లు అమెరికాకు చెందిన వెండర్ గా ఐసీసీ కార్యాలయాన్ని నమ్మించాడు.
అలా తమకు రావాల్సిన బాకీలు క్లియర్ చేయాలంటూ మెయిల్స్ పెట్టాడు. అలా నాలుగు సార్లు మెయిల్ చేసి దాదాపు రూ.20 కోట్ల వరకు కాజేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంపై మాత్రం ఐసీసీ ఎక్కడా అధికారికంగా స్పందించలేదు. కానీ, దర్యాప్తు కూడా జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇంత మొత్తాన్ని కోల్పోయారని తెలుసుకుని ఐసీసీకి అనుబంధంగా ఉన్న కొన్ని బోర్డులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఐసీసీ.. అంతర్గతంగా కూడా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అసలు ఐసీసీ ఉద్యోగులు అంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.