ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి కౌంట్డౌన్ మొదలైపోయింది. ఇప్పటికే.. టోర్నీకి సంబంధించి వేదికలు, జట్లు ఖరారు కాగా, తాజాగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) టోర్నీకి సంబంధించి ప్రైజ్మనీ వివరాలను వెల్లడించింది. విజేత, రన్నరప్లతో పాటు సెమీ ఫైనలిస్టులు, సూపర్-12 దశలో విజయాలు నమోదు చేసిన జట్లు, సూపర్-12 స్టేజ్లో నిష్క్రమించిన జట్లు, తొలి రౌండ్ విజేతలు, మొదటి రౌండ్లోనే వెనుదిరిగిన టీమ్లకు ఎంత మొత్తంలో అందజేయనుందో ప్రకటించింది.
ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం.. విజేతగా నిలిచిన జట్టుకు 1,600,000 అమెరికన్ డాలర్లు(భారత కరెన్సీలో 13,05,35,440 కోట్ల రూపాయలు) ప్రైజ్మనీగా లభించనుంది. అలాగే.. రన్నరప్ గా నిలిచిన జట్టు 800,000 అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో 6,52,64,280 కోట్ల రూపాయలు) అందుకోనుంది. ఇక.. గ్రూప్ స్టేజీలో అంటే.. క్వాలిఫైయర్స్ లో తలపడే 12 జట్లు 40 వేల డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 32 లక్షల 60 వేల రూపాయలు) అందుకోనుండగా, వీటిల్లో గెలిచి సూపర్ 12 రౌండ్కి అర్హత సాధించిన నాలుగు జట్లు మరో రూ.40 వేల డాలర్లు అదనంగా అందుకుంటాయి. ఇక.. సూపర్ 12 రౌండ్లో సెమీ ఫైనల్ చేరిన 4 జట్లు 4 లక్షల డాలర్లు (3 కోట్ల 26 లక్షలకు పైగా ) అందుకోనుండగా, ఓడిన 8 జట్లు.. తలా 70 వేల డాలర్లు (57 లక్షల రూపాయలకు పైగా) అందుకుంటాయి.
అక్టోబర్ 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. ఇందులో ఆస్ట్రేలియా, భార పాకిస్తాన్, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ జట్లు నేరుగా సూపర్-12కు అర్హత సాధించగా.. మరో ఎనిమిది జట్లు క్వాలిఫైయర్స్ ఆడనున్నాయి. గతేడాది దారుణ వైఫల్యం మూటగట్టుకున్న మాజీ చాంపియన్ వెస్టిండీస్ సహా శ్రీలంక, యూఏఈ, నమీబియా, నెదర్లాండ్స్, జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్లు రెండు గ్రూపులుగా క్వాలిఫైయర్స్ పోటీల్లో తలపడనున్నాయి. రెండు గ్రూపుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-12కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెడుతుండగా, భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరమయినప్పటికీ భారత జట్టు బలంగానే కనిపిస్తోంది.