టీ20 వరల్డ్ కప్ అయిపోయింది. సెమీస్ లో ఓడిపోయిన టీమిండియా.. న్యూజిలాండ్ తో టీ20, వన్డే సిరీస్ ల కోసం రెడీ అయిపోయింది. ఇకపోతే టోర్నీలో ఆడిన స్టార్ క్రికెటర్ కోహ్లీ, రోహిత్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్లకు ఈ సిరీస్ కోసం రెస్ట్ ఇచ్చేశారు. దీంతో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టీ20ల నుంచి సీనియర్లని తప్పించి కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో హార్దిక్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారడమే కాదు రోహిత్, కోహ్లీ ఫ్యాన్స్ ని అయోమయంలో పడేశాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈసారి టీ20 ప్రపంచకప్ లో సాధారణ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియా, ఒకానొక దశలో కప్ పై ఆశలు రేపింది. సెమీస్ లో ఇంగ్లాండ్ పై గెలిచి, ఫైనల్లోనూ అదరగొడుతుందని అనుకున్నారు. కానీ ఇంగ్లీష్ జట్టు.. మనల్ని చిత్తుగా ఓడించింది. దీంతో భారత్.. టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. ఇక కప్ కొట్టాలేక చతికిలపడిన మన జట్టు ఆటపై చాలా విమర్శలు వచ్చాయి. కొందరైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని తప్పించేయాలని కూడా సూచించారు. తాజాగా న్యూజిలాండ్ తో సిరీస్ ప్రారంభానికి ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్య వ్యాఖ్యలు చూస్తుంటే.. త్వరలో అదే జరగనుందా అనిపిస్తోంది.
‘టీ20 వరల్డ్ కప్ వల్ల మేం(టీమిండియా) చాలా డిసప్పాయింట్ అయ్యాం. తర్వాత దానికి ఇంకా రెండేళ్ల సమయముంది. అంతలో చాలా మ్యాచ్ లు ఆడతాం. చాలామంది ఆటగాళ్లకు ఛాన్సులు వస్తాయి. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచి రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నాం. ఇంకా టోర్నీకి చాలా టైం ఉంది కాబట్టి కొన్నిరోజుల తర్వాత దానిపై ఫుల్ కాన్స్ ట్రేట్ చేస్తాం. కీలక ఆటగాళ్లు(రోహిత్, కోహ్లీ తదితరులు) ప్రస్తుతం జట్టులో లేరు. అదే టైంలో వాళ్ల కంటే ప్రతిభావంతులు జట్టులో ఉన్నారు. రాబోయే ఏడాదిన్నరలో వాళ్లు కూడా చాలా మ్యాచులు ఆడతారు. వారు ఎంత టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి చాలా అవకాశముంది. వాళ్ల గేమ్ కోసం నేను ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఇకపై ప్రతి సిరీస్ కూడా మాకు ముఖ్యమే’ అని కెప్టెన్ హర్దిక్ పాండ్య అన్నాడు.
ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్య మాటల బట్టి చూస్తుంటే స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీకు రెస్ట్ ఇవ్వడం అనేది న్యూజిలాండ్ సిరీస్ వరకు మాత్రమే కాదని అనిపిస్తోంది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉంది కాబట్టి వాళ్లను ఇప్పటికిప్పుడే తప్పించకపోవచ్చు గానీ 2024 టీ20 వరల్డ్ కప్ కోసం మాత్రం వాళ్లు జట్టులో ఉండే ఛాన్సే లేదని అర్థమవుతోంది. అంతలో యంగ్ క్రికెటర్లతో జట్టుని ఫామ్ చేసి, హార్దిక్ ని కెప్టెన్ గా పర్మినెంట్ చేస్తారనిపిస్తోంది. ఇదిలా ఉండగా నవంబరు 18 నుంచి 30వ తేదీ మధ్య న్యూజిలాండ్-టీమిండియా జట్లు తలో మూడు టీ20, వన్డేలు ఆడనున్నాయి. వీటిలో హార్దిక్ బృందం ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.
How’s that for a Trophy unveil! 🤩 🏆#TeamIndia | #NZvIND
📸 Courtesy: @PhotosportNZ pic.twitter.com/qTazPXpr3R
— BCCI (@BCCI) November 16, 2022