ఆ కుర్రాడు మంచి బ్యాటర్. దేశవాళీతో పాటు ఐపీఎల్ లోనూ ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్సులు ఆడాడు. అయినా సరే లాభం లేకుండా పోతోంది. జాతీయ జట్టులో సరైన అవకాశాలు దక్కట్లేదు. ఒకవేళ ఇచ్చినా సరే ఒకటో రెండో మ్యాచులు ఆడిస్తున్నారు. అది కాదంటే బెంచ్ కే పరిమితం చేస్తున్నారు. త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం జట్టు ప్రకటించగా, అందులోనూ సంజూ శాంసన్ కి స్థానం దక్కలేదు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాతో మూడు మ్యాచుల టీ20 సిరీస్ ని టీమిండియా కైవసం చేసుకుంది. 2-1 తేడాతో గెలిచి, దక్షిణాఫ్రికా జట్టుతో టీ20 సిరీస్ కి సిద్ధమైంది.
కేరళలోని త్రివేండ్రంలో బుధవారం తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీసులో మునిగిపోయారు. మరోవైపు ఊరిలో మ్యాచ్ సందడి కూడా ఎక్కువైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీకి సంబంధించిన భారీ కటౌట్లు పెట్టారు. ఇప్పుడు వాళ్లకు పోటీగా తమ రాష్ట్ర క్రికెటర్ సంజూ శాంసన్ కటౌట్ ని కూడా అదే రేంజులో పెట్టడం విశేషం. మరోవైపు భారత జట్టు ఎయిర్ పోర్ట్ నుంచి త్రివేండ్రం చేరుకునే టైములో సంజూ.. సంజూ అని పలువురు ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలని అశ్విన్, చాహల్.. తమ ఇన్ స్టా స్టోరీ పోస్ట్ చేశారు. త్రివేండ్రంలో సంజూ పేరు దద్దరిల్లిపోతోందని పేర్కొన్నారు. ఇక దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు సంజూని ఎంపిక చేయాలని అభిమానులు, సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు.
బీసీసీఐ మాత్రం విఫలమవుతున్న పంత్ కే మళ్లీ జట్టులో అవకాశం కల్పించింది. ఈ విషయమై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో విఫలమవుతున్న పంత్ కి ఇంకెన్ని అవకాశాలు ఇస్తారని, సంజూ శాంసన్ చేసిన తప్పేంటని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు. పలువురు మాజీలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సంజూ గురించి మాట్లాడిన బీసీసీఐ అధికారి ఒకరు.. టీ20 ప్రపంచకప్ కోసం అతడి పేరునే పరిశీలించలేదని అన్నారు. పంత్ ని పక్కనపెట్టాలనే ఉద్దేశం సెలక్టర్లకు లేదని, ప్రస్తుత జట్టులో ఏకైక లెఫ్టాండర్ బ్యాటర్ అతడేనని అన్నారు. దీన్నిబట్టి చూస్తుంటే కుడిచేతి వాటం బ్యాటర్ కావడం సంజూకి మైనస్ అయిందా అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. సంజూని ప్రపంచకప్ కోసం సెలెక్ట్ చేయకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.