ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు ఇంగ్లండ్ వెళ్లిన టీమిండియాకు మ్యాచ్లు ఆరంభం కాకముందే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇటివల కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. కీలకమైన సిరీస్కు ముందు కెప్టెన్ ఇలా కరోనా బారిన పడటంతో బీసీసీఐ ఈ విషయంపై విచారణ జరిపినట్లు సమాచారం. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా.. ఆటగాళ్లు కరోనా ఎలా సోకుతోందని విచారణ జరపగా.. నిబంధనలను తుంగలోతొక్కి ఆటగాళ్లు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం, అభిమానులతో ఫొటోలకు ఫోజులు ఇవ్వడంతోనే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించి ఆటగాళ్లకు బీసీసీఐ పెద్దలు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.
టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన ఫోటోలు వీడియోలు నెట్టింట హల్ చల్ చేశాయి. వారు తమ అభిమానులతో సెల్ఫీలు దిగుతున్నట్లు ఆ చిత్రాల్లో కన్పించింది. వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సైతం కొంతమంది పిల్లలు వచ్చి ఆటోగ్రాఫ్, ఫోటోలు అడిగేసరికి తాను కూడా ఆటోగ్రాఫ్స్ ఇచ్చి వారి సమూహంతో పాటు ఫోటోలు దిగాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ప్లేయర్లు పబ్లిక్తో దూరంగా ఉండాలి. కానీ ఆటగాళ్లు రూల్స్ మర్చి.. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో పద్దతి మార్చుకోవాలని, గాలి తిరుగుళ్లు బంద్ చేయాలని బీసీసీఐ ఆటగాళ్లకు కాస్త గట్టిగానే చెప్పినట్లు సమాచారం. జూనియర్ ఆటగాళ్లు ఒకే కానీ.. కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్ను కంట్రోల్ చేయడమే బీసీసీఐకి కొంత తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై బోర్డు సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
ఇక జులై 1న బర్మింగ్ హమ్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో ప్రారంభమయ్యే రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్టు కోసం భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది. రీషెడ్యూల్ చేయబడిన ఈ ఐదవ టెస్ట్ ఇంగ్లాండ్లో 2021లో జరిగిన భారత సిరీస్లో ఐదవ మ్యాచ్గా పరిగణించబడుతుంది. ఇప్పటికే ఈ సిరీస్లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. అప్పట్లో భారత శిబిరంలో కోవిడ్-19 కేసులు వెలుగు చూడడంతో చివరి నిమిషంలో ఐదో టెస్టు వాయిదా పడింది. మరి ఇంగ్లండ్లో టీమిండియా ఆటగాళ్ల ప్రవర్తనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.