ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ సాకర్. ఆ తర్వాత ఆ స్థానం క్రికెట్ దే అని చెప్పాలి. ఇక క్రికెట్ ను మన దేశంలో ఓ ఆటగా కాకుండా ఎమోషన్ గా చూస్తాం. అందుకే టీమిండియా మ్యాచ్ వస్తుంది అంటే చాలు టీవీలకు అతుక్కుపోతాం. అంతలా మన రక్తంలో జీర్ణించుకుపోయింది క్రికెట్. మరి అలాంటి క్రికెట్ లో ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తిన ఓ మ్యాచ్ గురించి ఇప్పడు చెప్పుకోబోతున్నాం. చరిత్ర గతించినప్పటికీ ఆ పోరాటం ఎప్పటికీ మరుగునపడిపోదు. కొన్ని పోరాటాలు చరిత్రలో మిగిలితే.. మరికొన్ని పోరాటాలే చరిత్రా లిఖించబడతాయి. అలా లిఖించబడ్డదే భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్. స్వల్ప స్కోర్లు నమోదు చేయబడ్డ ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు ఆసిస్ బ్యాటర్లను చీల్చిచెండాడారు. మరీ ముఖ్యంగా టీమిండియా టర్బోనేటర్ హర్భజన్ సింగ్ స్పిన్ ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు గింగిరాలు తిరిగారు. దాంతో అప్పటి నుంచి హర్భజన్ అంటే ఆసిస్ కు వణుకే.
అది 2004 నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇండియా గడ్డపై అడుగుపెట్టింది ఆస్ట్రేలియా జట్టు. అప్పటికే మూడు టెస్టుల్లో 2 ఆసిస్ టీమ్ గెలవగా ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరిది అయిన 4వ టెస్ట్ మ్యాచ్ కు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా నిలిచింది. రెండు టెస్టుల్లో ఓడిపోయి.. ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉంది భారత జట్టు. అటు ఆసిస్.. టీమిండియాను చివరి టెస్టులో కూడా ఓడించి తమ సత్తా ఏంటో మరోసారి నిరూపించుకోవాలని ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ ప్రారంభం అయ్యింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఓపెనర్లుగా గౌతమ్ గంభీర్-వీరేంద్ర సెహ్వాగ్ లు బరిలోకి దిగారు. గంభీర్ కు ఇదే తొలి టెస్ట్ మ్యాచ్ కావడం గమనార్హం.
ఇక మ్యాచ్ మెుదలైంది.. ఎప్పటిలాగే ఆసిస్ బౌలర్లు రెచ్చిపోయారు. టీమిండియా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తు.. బౌలింగ్ చేశారు. ఆసిస్ బౌలర్ల ధాటికి భారత్ 104 పరుగులకే కుప్పకూలింది. జట్టులో అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నాటౌట్ గా నిలిచి, చేసిన 31 పరుగులే టాప్ స్కోర్. మిగతా బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా కనీసం 20 పరుగులు దాటలేదు. ఆసిస్ బౌలర్లలో జాసన్ గిలెస్పీ 4 వికెట్లు తీస్తే.. అరంగేట్ర బౌలర్ నాథన్ హర్టిచ్ 3 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్లు తమ సత్తా ఏంటో చూపించారు. దాంతో టీమిండియా బౌలర్ల ధాటికి 203 పరుగులకే ఆసిస్ కుప్పకూలింది. దాంతో ఆసిస్ కు 99 రన్స్ ఆధిక్యం లభించింది.
భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే 5 వికెట్లు తీసి ఆసిస్ పతనాన్ని శాసించాడు. మురళి కార్తిక్ 4 వికెట్లు తీశాడు. అయితే మెుదటి ఇన్నింగ్స్ లో చేసిన తప్పులు మళ్లీ చేయకూడదు అని టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ ను ఆరంభించింది. సెహ్వాగ్-గంభీర్ మరోసారి విఫలం అవ్వగా.. లక్ష్మణ్, సచిన్ లు భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఈ క్రమంలోనే ఇద్దరు అర్దశతకాలను నమోదు చేసుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ లయలో ఉన్న వీరిద్దరిని స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ కు చేర్చాడు హర్టిచ్. 69 పరుగులకు లక్ష్మణ్, 55 రన్స్ చేసి సచిన్ లు అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లను ఒకరి తర్వాత ఒకరిని పెవిలియన్ బాట పట్టించాడు మైఖెల్ క్లార్క్. అద్భుతమైన బౌలింగ్ తో 6 వికెట్లు పడగొట్టాడు. దాంతో భారత్ 205 పరుగులకే కుప్పకూలింది. దాంతో భారత్ కు 106 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
ఇక ఆసిస్ ముందు ఉన్న లక్ష్యం కేవలం 106 పరుగులు మాత్రమే.. దాంతో టీమిండియా ఓటమి ఖాయం అనుకున్నారు అంతా. ఎందుకంటే ఆస్ట్రేలియా జట్టులో హేమాహేమీలు అయిన ఆటగాళ్లు ఉన్నారు. లాంగర్, హెడెన్, పాంటింగ్, మార్టిన్, గిల్ క్రిస్ట్, కటిచ్ లాంటి ఉద్దండులు ఉన్నారు. ఈ క్రమంలోనే స్వల్ప లక్ష్యంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. తొలి ఓవర్ రెండో బంతికే జహీర్ ఖాన్ లాంగర్ ను డకౌట్ చేశాడు. దాంతో భారత జట్టు శిబిరంలో ఆశలు రేకెత్తాయి. ఆ తర్వాత వెంటనే కెప్టెన్ పాంటింగ్(12)ను మురళి కార్తిక్ పెవిలియన్ కు పంపించాడు. ఇక అక్కడి నుంచి భారత బౌలర్లు ఆసిస్ బ్యాటర్లపై యుద్ధాన్నే ప్రకటించారు. ఒక్క ఆసిస్ బ్యాటర్ ను కూడా క్రీజ్ లో నిలదొక్కుకోనివ్వలేదు. వచ్చిన బ్యాటర్ ను వచ్చినట్లే పెవిలియన్ కు పంపించారు.
ఈ క్రమంలోనే డేంజర్ గా మారుతున్న మథ్యూ హెడెన్(24)ను హర్భజన్ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. భారత బౌలర్ల ధాటికి ఆసిస్ బ్యాటర్లు 93 పరుగులకే చేతులెత్తేశారు. కచ్చితంగా గెలుస్తారు అనుకున్న ఆస్ట్రేలియా జట్టును కంగుతినేలా చేశారు భారత బౌలర్లు. 93 పరుగులకు ఆసిస్ ఆలౌట్ కావడంతో 13 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ ఇన్నింగ్స్ లో హర్భజన్ 5 వికెట్లు తీసి ఆసిస్ నడ్డివిరిచాడు. అతడికి తోడు మురళి కార్తిక్ 3 వికెట్లతో సత్తాచాటాడు. 106 పరుగుల లక్ష్యం.. జట్టులో హేమాహేమీ బ్యాటర్లు ఉన్నాగానీ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం టీమిండియా సొంతం. ఆ ఆత్మ విశ్వాసమే భారత జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హర్భజన్ అంటే ఆసిస్ కు వణుకు అనే చెప్పాలి.