మూలిగే నక్కపై మూడిత్తుల తాటికాయ పడ్డట్టు అనే సామెత మీకు గుర్తుందా? ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి అలాగే తయారైంది. భద్రతా కారణాలను ఎత్తిచూపుతూ టాస్ వేసే అరగంటకు ముందు పెట్టేబేడా సర్దుకుని వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అదే పెద్ద దెబ్బ అనుకుంటే న్యూజిలాండ్ దారిలోనే ఇంగ్లాండ్ కూడా తమ పర్యటనను రద్దు చేసుకుంది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ బోర్డుల తీరుతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు కోట్లలో నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వమే ప్రస్తావించిన విషయం తెలిసిందే. అసలే నష్టాల్లో నడుస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. న్యూజిలాండ్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సిబ్బంది తిండి ఖర్చులు తెలుసుకుని నోరెళ్లబెడుతోంది పీసీబీ.
న్యూజిలాండ్ టీమ్ బస చేసే హోటల్ నుంచి స్టేడియం ఇలా ప్రతి ప్రాంతంలో అదనపు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది పీసీబీ. అదనపు భద్రత కోసమే ఐదుగురు ఎస్పీలు సహా మొత్తం 500 మంది పోలీసులను ఏర్పాటు చేసింది. ఇలా వారంపాటు న్యూజిలాండ్కు వెన్నంటి ఉన్న సెక్యూరిటీ సిబ్బంది తిన్న బిర్యానీ బిల్లు తెలుసుకుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు బిత్తరపోయింది. అక్షరాలా 27 లక్షల రూపాయలు బిర్యానీ బిల్లు వచ్చిందని తెలిసి వాళ్లది కడుపా చెరువా.. ఇంత తిన్నారేంటిరా బాబూ అంటూ తలలు పట్టుకుంటున్నారు. టికెట్ల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం సహా మొత్తం కోట్లలో నష్టం వచ్చిందని బాధపడుతుంటే ఇప్పుడు ఈ బిర్యానీ బిల్లుతో పీసీబీకి చిర్రెత్తుకొచ్చిందంట.