ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, మూడు రాజధానుల అంశంపై చర్చలు జరిగాయి. ఈ క్రమంలో శాసన సభలో పారిశ్రామికాభివృద్ధి-పెట్టుబడులపై జరిగిన చర్చలో భాగంగా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, ఓ టీడీపీ నేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ ప్రాజెక్ట్ విషయంలో టెండర్ తనకు వచ్చినా సరే.. సదరు టీడీపీ నేత తనను 20 కోట్ల రూపాయలు లంచం అడిగాడని తెలిపాడు. అంతేకాక పార్టీ మారితేనే తన ప్రాజెక్ట్ కొనసాగిస్తామని చంద్రబాబు తనను బెదిరించారని తెలిపారు. కానీ తాను లొంగకపోవడంతో.. తనకు వచ్చిన ప్రాజెక్ట్ను రద్దు చేశారని వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఆ వివరాలు..
శాసనసభలో చర్చ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ‘‘2012లో గౌతమ్బుద్ధ టెక్సాస్ పార్క్ పేరిట టెండర్ వేశాను. అది నాకే వచ్చింది. డబ్బులు చెల్లించడంతో రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యింది. అంతేకాక కేంద్రం నుంచి 40 కోట్ల రూపాయల సబ్సిడీ కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత రాష్ట్రం విడిపోవడం, టీడీపీ అధికారంలోకి రావడంతో నా ప్రాజెక్ట్ విషయంలో దారుణంగా ప్రవర్తించారు. అప్పటి టీడీపీ చిలకలూరిపేట నేత ఒకరు.. నాకు వచ్చిన 40 కోట్ల సబ్సిడీలో తనకు లంచంగా 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే.. అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. లంచం కోసం నన్ను వేధించారు’’ అంటూ బ్రహ్మనాయుడు అసెంబ్లీలో చెప్పుకొచ్చారు.
ఇక బ్రహ్మనాయుడిని లంచం అడిగిన టీడీపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఇక లంచం ఇచ్చేందుకు తాను అంగీకరించకపోవడంతో టెక్స్టైల్ పార్కును రద్దు చేయాల్సిందిగా మరుసటి రోజే ధూళిపాళ్ల నరేంద్ర చేత ప్రభుత్వానికి లేఖ రాయించారని బ్రహ్మనాయుడు తెలిపారు. ఆ వెంటనే చంద్రబాబు తన ఇంటికి మనుషులను పంపించి వైసీపీని వీడి టీడీపీలో చేరితే టెక్స్టైల్ పార్కును కొనసాగిస్తామని లేకుంటే రద్దు చేస్తామని చెప్పారని వెల్లడించారు. అయితే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పగా తనకు రిజిస్ట్రేషన్ అయిన భూమిని కూడా రద్దు చేశారని తెలిపారు. ఇలాంటి పనులు కారణంగానే టీడీపీ హయాంలో పరిశ్రమలు పారిపోయాయని బ్రహ్మనాయుడు ఎద్దేవా చేశారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.