వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో కలిసేందుకు వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసుపై చేయి చేసుకున్నారు.
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. షర్మిలను కలిసేందుకు వైఎస్ విజయమ్మ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. పోలీస్ స్టేషన్ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కారు లోంచి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ విజయమ్మ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. షర్మిలను కలిసేందుకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అంశంపై ప్రశ్నించడానికి బయటకు వచ్చిన తన కూతుర్ని అన్యాయంగా ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో విజయమ్మ చాలా సేపు కారులోనే ఉండిపోయారు. ఈ విషయం మీద తాను కోర్టుకు వెళ్తానని ఆమె అన్నారు.
లోటస్ పాండ్ వద్ద ఎస్సై, మహిళా కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నందుకు గాను షర్మిల మీద ఐపీసీ 353, ఐపీసీ 330 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తనను అరెస్ట్ చేయడంపై షర్మిల స్పందించారు. సిట్ కార్యాలయానికి తానొక్క దాన్నే వెళ్లాలనుకున్నానని.. సిట్ అధికారిని కలిసి టీఎస్పీఎస్సీ దర్యాప్తు మీద వినతి పత్రం ఇవ్వాలనుకున్నానని ఆమె అన్నారు. కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు అనుమానాలు ఉంటే అధికారికి చెప్పడం తన బాధ్యత అని అన్నారు. సిట్ కార్యాలయానికి ఎవరికీ చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని.. తానేమీ ధర్నాకు పోలేదని అన్నారు. తానేమీ సిట్ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వలేదని.. తనను బయటకు పోనియ్యకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని షర్మిల ప్రశ్నించారు.
వ్యక్తిగత స్వేచ్ఛ లేదా? తానేమైనా క్రిమినల్ నా? హంతకురాలినా? ఇంటి చుట్టూ వందలాది మంది పోలీసుల పహారా ఎందుకంటూ ప్రశ్నించారు. పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని, తన దారిన తాను వెళ్తుంటే అడ్డుపడ్డారని ఆమె అన్నారు. నా మీద పడితే భరించాలా? రక్షణ కోసం సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం తన బాధ్యత అని అన్నారు. ఒక మహిళను పురుష పోలీసులు ఎలా అడ్డుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.