రాజకీయాలు అన్నాక గెలుపు ఓటములు సహజం. గెలిస్తే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాలి.. ఓడిపోతే ప్రజా సమస్యలపై పోరాడాలి. ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలి. రెండు నాల్కల ధోరణి అస్సలు పనికిరాదు. విజయమో, వీర స్వర్గమో అన్నట్లు ఉండాలి. అంతేతప్ప.. జనాలను ఎగదోసి.. వారు ఇబ్బంది పడుతుంటే.. దాని నుంచి లాభం పొందాలని ఆశిస్తే.. ఏదో ఒక రోజు దారుణంగా దెబ్బ తింటారు. టీడీపీకి ఇలాంటి అనుభవాలు గతంలో అనేకం ఉన్నప్పటికి.. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మరోసారి ఇదే పంథాలో వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు. అమరావతే ఏకైక రాజధానిగా ఉండాలంటూ అరసవల్లి వరకూ రైతులు పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. అమరావతి రైతులతో సహా, ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు పాదయాత్ర చేపట్టారు. ఇక ఈ పాదయాత్రలో టీడీపీ ప్రధాన నాయకులేవరు కనిపించపోవడం ఆశ్చర్యం.
అమరావతిని రాజధానిగా ప్రకటించింది.. అక్కడ కాపిటల్ సిటీ నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు తీసుకుంది టీడీపీనే. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించి.. నిర్మాణాలు కూడా చెపట్టాడు. అయితే దీని వెనక అక్రమాలు జరిగాయని.. టీడీపీ నేతలకు ముందుగానే రాజధాని ఎక్కడ వస్తుందనే విషయం తెలిసి.. జాగ్రత్తపడ్డారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ.. అభివృద్ధి మొత్తం ఒకే ప్రాంతంలో జరిగితే.. భవిష్యత్తులో నష్టం వస్తుందని.. వికేంద్రీకరణకు పెద్ద పీట వేస్తూ.. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై ప్రతిపక్షాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా జగన్ మాత్రం ముందుకే వెళ్తున్నారు.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే.. అమరావతిని రాజధానిగా గుర్తించింది టీడీపీ పార్టీ. మరి ఇప్పుడు దాని కోసం రైతులు పాదయాత్ర చేస్తున్న వేళ.. వారికి మద్దతుగా ఉండాల్సింది కూడా టీడీపీనే. కానీ ఆశ్చర్యంగా రైతులు పాదయాత్రలో ఆ పార్టీ కీలక నేతలెవరూ కనిపించడం లేదు. కృష్ణాయపాలెం నుంచి లోకేశ్ పాల్గొంటారని ముందే ప్రకటించినా, అనారోగ్యంతో చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యిందని చెబుతున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం వుందో వారికే తెలియాలి. ఇక గుంటూరు నుంచి టీడీపీ తరఫున ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ కూడా పాదయాత్రలో కనిపించలేదు. ఇక చంద్రబాబు సంగతి చెప్పాల్సిన పని లేదు. అంటే రైతులను ముందు పెట్టి చంద్రబాబు తన పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ పాదయాత్రలో పాల్గొని ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారనే సంకేతాలు వెళితే రాజకీయంగా మిగతా ప్రాంతాల్లో తమకు నష్టం కలుగుతుంది అనే ఉద్దేశంతోనే చంద్రబాబు దూరంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే.. అమరావతికి మద్దతివ్వడానికి ఇంత భయపడుతుంటే.. తీరా ఎన్నికల వేళ.. దానికి ధైర్యంగా కట్టుబడి ఉంటారా అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మరోవైపు ఈ విషయంలో సీఎం జగన్ తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. రాజధానిపై జగన్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. దానికే కట్టుబడి.. ముందుకెళ్తున్నారు. అంతేకాక మరోసారి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ నుంచే జగన్ పాలన సాగిస్తారని మంత్రులు పదేపదే చెబుతున్నారు. ఈ క్రమంలో రాజధాని అంశంపై సీఎం జగన్తో చంద్రబాబు నాయుడి వైఖరిని పోల్చుతూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.