రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నా సరే.. అధికారి, విపక్ష పార్టీల అధ్యక్షులు పోటీ చేసే స్థానాలపై ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. ఎన్నికల వేళ మిగతా ప్రాంతాల్లో ఫలితాలు ఎలా ఉన్నా.. ఈ కీలక నియోజకవర్గాల్లో గెలుపోటములు.. పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకే నేతలు సొంత నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తారు. అలా గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా నిలుస్తున్న నియోజకవర్గం.. కుప్పం. ఈ ప్రాంతం చంద్రబాబు ఇలాకా, కంచుకోట. ఇక్కడ బాబుని ఓడించడం అంత సులభం కాదు. అందుకే అధికార వైసీపీ.. కుప్పంని టార్గెట్ చేసింది. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా అయినా సరే.. కుప్పంలో వైసీపీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా కుప్పంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కుప్పం మున్సిపాలిటి అభివృద్ధి కోసం భారీ ఎత్తున నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరి కొద్ది రోజుల్లో కుప్పంలో పర్యటించనున్నారు సీఎం జగన్.
సీఎం జగన్ కుప్పం పర్యటన నేపథ్యంలో.. మరోసారి ఈ నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. సెప్టెంబర్ 22న సీఎం జగన్ కుప్పంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడమే కాక.. పలు ప్రాజెక్ట్లకు శంఖుస్థాపన కూడా చేస్తారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. పర్యటనకు మరో వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో.. ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. సీఎం టూర్ని గ్రాండ్ సక్సెస్ చేసేందుకు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పని చేస్తున్నాయి.
ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా పాల్గొనాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఆహ్వానం కూడా వెళ్తుంది. ఈ క్రమంలో కుప్పం ఎమ్మెల్యే అయిన చంద్రబాబు జగన్ పర్యటనలో పాల్గొంటారా లేదా అనే దానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు జగన్ టూర్లో పాల్గొనడని.. ఎక్కువ మంది భావిస్తున్నారు. అదే జరిగితే.. పార్టీ గురించి జనాల్లోకి తప్పుగా వెళ్లే అవకాశం ఉందని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు.
జగన్ కుప్పం టూర్లో భాగంగా ఈ మున్సిపాలిటీలో 66 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వైఎస్సార్ చేయూత కార్యక్రమంలో కూడా పాల్గొంటారని తెలిసింది. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో చంద్రబాబు అనేకసార్లు పర్యటించారు. కానీ జగన్ ఇంత వరకు కుప్పం వెళ్లలేదు. ఈ క్రమంలో తొలిసారి జగన్ కుప్పం వెళుతుండటంతో నియోజకవర్గానికి మరిన్ని వరాలు ప్రకటించే అవకాశముంది. అదే జరిగితే చంద్రబాబుకి, టీడీపీకి భారీ నష్టం తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో జగన్ చేసే ప్రకటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయంగా చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకే జగన్ కుప్పం పర్యటనను ఎంచుకున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మరి కుప్పంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.