గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి (జగ్గారెడ్డి) నేడు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. జగ్గారెడ్డి ఈ రోజే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు.. కానీ కొందరు పార్టీ పెద్దలు వారించబట్టి ఆ నిర్ణయాన్ని తాత్కలికంగా వాయిదా వేసుకున్నారు. అయితే తాను పార్టీని వీడేది ఖాయమని.. దానివల్ల తనకు, పార్టీకి ఎలాంటి నష్టం లేదని తెలిపారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తాను పార్టీలో ఉండి ఇబ్బంది పడలేనని, అలాగే కాంగ్రెస్ ను కూడా ఇబ్బంది పెట్టలేనని అన్నారు. తాను కరెక్టుగా ఉన్నాను కాబట్టే వాస్తవాలు మాట్లాడుతున్నాను అన్నారు. తాను ఎవరికీ భయపడబోనని తెలిపారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం తన స్వభావమని జగ్గారెడ్డి తెలిపారు.
తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడిని భరించలేకపోతున్నానని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్ర విభజన సరికాదని తాను చెప్పానని జగ్గారెడ్డి గుర్తు చేశారు. జగ్గారెడ్డి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని కాంగ్రెస్ లో ఒకవర్గం ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమని అన్నారు. చరిత్ర ఉన్న పార్టీలో ఉండాలనుకునే ఇన్నాళ్లు ఉన్నానని జగ్గారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన తర్వాత తాను ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లనని, స్వతంత్రంగానే వ్యవహరిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను బయటకు పోవడం వల్ల రాజకీయంగా తనకు, కాంగ్రెస్ కు పెద్దగా నష్టం వచ్చేది లేదని తెలిపారు.
మూడు రోజుల్లో రాజీనామా….
తనపై రోజూ బురద జల్లుతున్నారు కాబట్టి మనస్తాపానికి గురయ్యానని జగ్గారెడ్డి తెలిపారు. తాను బయటకు వెళ్లిపోతే బాగుంటుందని కొందరు భావిస్తున్నారు కాబట్టి తాను పార్టీకి దూరం అవుతున్నానని చెప్పారు. తాను ఈరోజే రాజీనామా చేయలనుకున్నానని, కొందరు పెద్దలు వారించబట్టి ఈరోజు ఆగానని తెలిపారు. ప్రస్తుతానికి తాను రాజీనామా ఆలోచనను తాత్కాలికంగా విరమించుకున్నానని, అంతేతప్ప కాంగ్రెస్ లో ఉండే ప్రసక్తి లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. రెండు మూడురోజుల్లో అందరినీ ఒప్పించి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి తెలిపారు.
తాను బయటకు వెళ్లినా సోనియా, రాహుల్ గాంధీ పట్ల విధేయతతోనే ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రిని కలిస్తే దుష్ప్రచారం చేశారన్నారు. తన నియోజకవర్గానికి వచ్చిన మంత్రి కేటీఆర్ ను కలిస్తే తప్పుపట్టారన్నారు. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉంటే ఎవరినైనా కలసి సంగారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.