రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతాయనే సంగతి తెలిసిందే. అత్యధిక విరాళాలు అందుకున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు టాప్లో నిలిచాయి. ఆ వివరాలు..
దేశంలోని జాతీయ పార్టీలు మొదలు ప్రాంతీయ పార్టీల వరకు అన్నింటికి విరాళాలు అందుతాయనే సంగతి తెలిసిందే. ఈ విరాళాల ద్వారా పార్టీలు అనేక కార్యక్రమాలు, ఎన్నికల వేళ ప్రచారానికి ఖర్చు చేయడం వంటివి చేస్తాయి. ఇక సాధారణంగా జాతీయ పార్టీకి విరాళాలు ఎక్కువ వచ్చేవి. అయితే ఈ సారి ఆ జాబితాలో ప్రాంతీయ పార్టీలు చేరాయి. ఐదు ప్రాంతీయ పార్టీలకు భారీగా విరాళాలు వచ్చినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడించింది. సదరు పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన గణాంకాల ఆధారంగా ఈ వివరాలను వెల్లడించింది. అత్యధిక విరాళాలు అందుకుంటున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు ఉండటం విశేషం.
అయితే 2021-22 ఆర్థిక సంవత్సరానికి 26 ప్రాంతీయ పార్టీలకు రూ.189.80 కోట్లు సమకూరాయి అని నివేదిక వెల్లడించింది. 5 ప్రాంతీయ పార్టీలు అత్యధిక వాటా దక్కించున్నాయి అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వెల్లడించింది. బీఆర్ఎస్, జేడీయూ, ఆప్, సమాజ్వాది పార్టీ, వైసీపీలు అత్యధిక విరాళాలు దక్కించుకున్నాయని.. ఈ ఐదు పార్టీలకు ఏకంగా రూ.162.21 కోట్లు విరాళాలుగా అందాయని తెలిపింది. ఆయా పార్టీలు ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాల ఆధారంగా ఈ గణంకాలు వెల్లడించింది. 26 ప్రాంతీయ పార్టీల్లో కొన్నింటికి విరాళాల రూపంలో రూ.20 వేలకు పైన, అంతకన్న తక్కువ మొత్తాల్లో అందినవి కూడా ఉన్నాయిని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ తెలిపింది.
ఇక ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు దక్కించుకున్న పార్టీగా బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఒక్క పార్టీకి 2021-22లో 14 విరాళాల ద్వారా రూ.40.90 కోట్లు అందాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 2,619 విరాళాల ద్వారా రూ.38.24 కోట్లు అందగా.. మూడో స్థానంలో ఉన్న జేడీయూ రూ.33.26 కోట్లు దక్కించుకోగా.. ఎస్పీ రూ.29.80 కోట్లతో నాలుగో స్థానంలో, రూ.20 కోట్లతో వైఎస్సార్సీపీ అయిదో స్థానంలో ఉన్నాయి.