తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక. టీఆర్ఎస్, బీజేపీ హోరా హోరిగా పోరాడిన ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థి అయిన రాజగోపాల్ రెడ్డి పై 10, 309 ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఇక ఈ ఎన్నికల్లో విజయం తర్వాత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం రెట్టింపు అయ్యింది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికలో ఓటమి తర్వాత తొలిసారి ఓటమిపై స్పందించారు రాజగోపాల్ రెడ్డి. ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమానికి గెస్టు గా వచ్చిన రాజగోపాల్ రెడ్డి ఇటు కేసీఆర్ పై, అటు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తాను అనవసంరగా రాజీనామా చేశానని చెప్పుకొచ్చాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
”కేసీఆర్ అంత అవినీతి పరుడు రాష్ర్టంలోనే కాదు ఈ దేశంలో కూడా లేడు” అని బీజేపీ లీడర్ రాజగోపాల్ రెడ్డి విమర్శించాడు. ఓపెన్ హార్డ్ విత్ ఆర్కే సీజన్ -3 కార్యక్రమానికి వచ్చిన ఆయన మునుగోడు అపజయానికి కారణాలను వెల్లడించాడు. రాజగోపాల్ రెడ్డి అటు టీఆర్ఎస్ కు, ఇటు బీజేపీకి పావుగా మారాడా? అని ప్రశ్నించగా.. సమాధానం ఇస్తూ..”రాజగోపాల్ రెడ్డికి పావుగా మారే అవసరం లేదు. నేను పోరాట యోథుడిని, ఫైటర్” ను అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ఓటమి తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారుగా అని అడిగితే.. అదేదో న్యూస్ ఛానల్ కు ప్రచారంలో భాగంగా చెప్పానని.. సన్యాసం తీసుకోనని రాజగోపాల్ రెడ్డి తెలిపాడు.
ఇక 18వేల కోట్ల కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతూ..” గత వృత్తికి ఇప్పటి దానికి లింకు పెడతారేంటి. గట్లైతే కేసీఆర్ పాస్ పోర్ట్ బ్రోకర్. అదీ కాక దేశంలోనే కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి ఎవరూ చేయలేదని ఆరోపించాడు. వారు భవిష్యత్తులో జైల్ కు వెళ్లడం ఖాయమని” రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నాడు. ఇక అనవసరంగా నేను రాజీనామా చేశానని చెప్పుకొచ్చాడు. బయటి పార్టీ వారిని తీసుకొచ్చి మా మీద పెత్తనం చెలాయిస్తే మేమెందుకు ఊరుకుంటాం అంటూ రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించాడు. నాకు టీపీసీసీ పదవి ఇస్తే అసలు ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశాడు. ఓడిపోయే వారిని 100 కోట్లు ఇచ్చి ఎందుకు కొంటారు.. అది టీఆర్ఎస్ ప్లాన్ అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ని వదిలే ప్రసక్తే లేదని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాజకీయాల్లో అన్నా, తమ్ముడు అంటూ కూర్చుంటే ఇక్కడే ఉంటామని, పోరాటం చేసుకుంటూ ముందుకు పోవాలని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి.