నీరవ్ మోడీ, లలిత్ మోడీ ఇలా మోడీ ఇంటి పేరున్న వ్యక్తులు దొంగలు అని రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు పర్యావసానమే ఈరోజు అనర్హత వేటుకు కారణమైంది. అయితే తనపై అనర్హత వేటుకు అసలు కారణం అది కాదని.. అదానీ గురించి ప్రశ్నించినందుకే బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనపై లేనిపోని అబాండాలు వేస్తుందని అన్నారు. అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన 20 వేల కోట్లు ఎవరివి అని ప్రశ్నించినందుకే తనపై అనర్హత వేటు వేశారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
లోక్ సభ సభ్యుడిగా తనను తొలగించిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ వరుసపెట్టి గౌతమ్ అదానీ, మోడీ మధ్య ఉన్న సంబంధంపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అదానీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకే తనను టార్గెట్ చేశారని, తనపై అనర్హత వేటు విధించారని, ఓబీసీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా తనను చిత్రీకరిస్తున్నారని విమర్శలు చేశారు. తాను ఒక్క ప్రశ్న మాత్రమే అడిగానని.. అదానీ షెల్ కంపెనీల్లో 20 వేల కోట్లు పెట్టుబడి పెట్టింది ఎవరని? ఆ 20 వేల కోట్లు అదానీవి కావని ప్రశ్న వేశానని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ, ప్రధాని మోదీ మధ్య సంబంధాలు ఉన్నాయని పార్లమెంట్ సాక్షిగా నిరూపించానని అన్నారు. అయితే తన వ్యాఖ్యలను కొట్టిపడేశారని అన్నారు.
అదానీ ఎయిర్ పోర్టులను ఏ విధంగా సవరించారన్న దానిపై వివరణ కోరుతూ స్పీకర్ కు లేఖ రాశానని.. అయితే ఆయన స్పందించలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. తన ప్రసంగాన్ని తొలగించారని.. అదానీ ఎయిర్ పోర్టులను ఇవ్వడానికి నియమాలను ఎలా సవరించారని స్పీకర్ కు వివరంగా లేఖ రాసి పంపానని.. కానీ స్పీకర్ నుంచి ఎటువంటి స్పందన లేదని రాహుల్ గాంధీ అన్నారు. దానికి బదులుగా తనపై బీజేపీ మంత్రులు తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. తాను స్పీకర్ ను కలిశానని, ఎందుకు తనను మాట్లాడనివ్వడం లేదని అడిగానని అన్నారు. అయితే స్పీకర్ నవ్వుతూ స్పందించారని.. తనను మాట్లాడడానికి అనుమతించనని స్పీకర్ అన్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది.. నేను ఒకటే ప్రశ్న అడిగాను.. అదాని షెల్ కంపెనీలలో రూ.20వేల కోట్లు ఎవరు పెట్టుబడి పెట్టారు.. అదాని, మోడీ స్నేహం గురించి పార్లమెంట్లో మాట్లాడాను.. వీరిద్దరి బంధం ఇప్పటిది కాదు, ఎప్పటినుంచో ఉంది: రాహుల్గాంధీ#RahulGandhi #PMModi #Adani
— NTV Breaking News (@NTVJustIn) March 25, 2023
అదానీ షెల్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన 20 వేల కోట్లు ఎవరివి అని? ఇదే ప్రశ్న అడుగుతానని అన్నారు. తనపై అనర్హత వేటు విధించడమే వారికి కావాలని.. అయితే తాను ఇలాంటి వాటికి భయపడనని అన్నారు. ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకే తాను ఇక్కడకు వచ్చానని, జైలు శిక్ష వేస్తారని అస్సలు భయపడనని అన్నారు. తన గురించి వారికి తెలియదని అన్నారు. ఓబీసీ కమ్యూనిటీని అవమానించానని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే కులాల మధ్య బేధాలు లేవని, అందరూ సమానమే అనేది తన అభిప్రాయమని అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా మాట్లాడిన స్పీచ్ లలో తాను పదే పదే అన్ని కులాలు, అందరూ సమానమే అన్న విషయాన్ని చెప్పానని అన్నారు.
తన ప్రశ్న ఓబీసీ కమ్యూనిటీకి సంబంధించినది కాదని, అదానీ కంపెనీల్లో పెట్టుబడి డబ్బు ఎవరిది అనేదే తన ప్రశ్న అని స్పష్టం చేశారు. తాను అదానీ ఇష్యూ గురించి మాట్లాడినప్పుడు మోదీ విపరీతంగా భయపడ్డారని, ఆ భయాన్ని ఆయన కళ్ళలో చూశానని రాహుల్ గాంధీ అన్నారు. అందుకే వారు మొదట అదానీ ఇష్యూని డైవర్ట్ చేశారని.. ఇప్పుడు తనపై అనర్హత వేటు విధించారని అన్నారు. తనకు మద్దతు ఇస్తున్న ప్రతిపక్ష పార్టీలకు కృతజ్ఞతలు చెప్పిన రాహుల్ గాంధీ.. మనం కలిసి పని చేద్దామని వారితో అన్నారు. మరి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.