ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వార్ పీక్స్కు చేరింది. ఇప్పటికే ఆయన అనేక విధాల ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇబ్బందికరంగా మారారు. అయితే ఆయన్ను పదవి నుంచి తప్పించేలా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరడం లేదు.. కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అన్నా న్యాయస్థానాల ద్వారా ఊరట పొందుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ పెద్దలు, అధికారులు సైతం రఘు రామను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మోదీ భీమవరం పర్యటన సందర్భంగా రఘురామ విషయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో రఘురామ మరో సారి సంచలన ఆరోపణలు చేశారు. తనను, తన కుటుంబ సభ్యులను హత్య చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ మేరకు ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. ఆ వివరాలు..
జులై 4న తన ఇంటి సమీపంలోని కొందరు రెక్కీ నిర్వహిస్తుండగా అందులో ఒకరిని సీఆర్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారని… అతడిని ప్రశ్నిస్తే ఏపీ ఇంటెలిజెన్స్కు చెందిన బాషా అని చెప్పాడని రఘురామ తన లేఖలో తెలిపారు. ఐడీ కార్డు అడిగితే చూపించలేదని, ఉన్నతాధికారుల వివరాలు కూడా చెప్పలేదని పేర్కొన్నారు. దీంతో అతడిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించామని.. కానీ ఏపీ పోలీసులకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మద్దతిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని రఘురామ ఆరోపించారు. ఈ వ్యవహారంపై తగిన చర్యలు తీసుకుని తెలంగాణలో శాంతి భద్రతలు రక్షించాలని రఘురామ కేసీఆర్కు రాసిన లేఖలో కోరారు.
మరోవైపు విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్పై దాడి చేసిన కేసులో ఎంపీ రఘురామ కృష్ణంరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్పై గచ్చిబౌలి పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు కానిస్టేబుల్ ఫరూక్పై దాడికి దిగిన సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండు చేసినట్లు అమరావతిలోని ఏపీ పోలీసు విభాగం ప్రకటించింది. అయితే రఘురామ ఇంటి వద్ద ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ ఎందుకు ఉన్నాడన్న విషయమై గచ్చిబౌలి పోలీసులు, ఏపీ పోలీసుల వివరణ భిన్నంగా ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎంపీ రఘురామ ఇంటివద్ద కానిస్టేబుల్ ఫరూక్ నిఘా విధులు నిర్వర్తిస్తున్నారని గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ చెబుతుండగా… ఫరూక్ విధులకు, రఘురామకృష్ణరాజు ఇంటితో ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంలో రఘురామ సీఎం కేసీఆర్కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.