ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. అధికార పార్టీకి షాకులు మీద షాకులు ఇస్తున్నాయి. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో మూడు చోట్ల టీడీపీ విజయం సాధించడం ఒక ఎత్తయితే.. ఇక తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ అనూహ్యంగా విజయం సాధించారు. ఈ ఫలితాలను చూస్తే.. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారనేది అందరికీ తెలిసిపోయింది. అయితే, ఎవరు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. క్రాస్ ఓటింగ్కు సంబంధించి.. ముఖ్యంగా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్కు సంబంధించి తనపై వస్తున్న వార్తలపై ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. తనపై వస్తోన్న వార్తలను కొట్టిపారేశారు. తాను పార్టీ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నానని స్పష్టం చేశారు. అంతేకాక, రహస్య ఓటింగ్ జరినప్పుడు.. తాను క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డానని ఎలా చెబుతారంటూ శ్రీదేవి నిలదీశారు. గురువారం ఉదయమే తన కూతురితో కలిసి ముఖ్యమంత్రి వైఎస్ జగ్మోహన్రెడ్డిని సైతం కలిశానంటూ ఈ సందర్భంగా ఫొటోలను విడుదల చేశారు శ్రీదేవి. ఈ సందర్భంగా కొన్ని అంశాల్లో సీఎం జగన్ తనకు హామీ కూడా ఇచ్చారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకిచ్చిన కోడ్ ప్రకారమే ఓటు వేశానని శ్రీదేవి స్పష్టం చేశారు.
తాను పార్టీకి ద్రోహం చేయలేదని.. అయినా తనపై తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళను కాబట్టే తనను ఇలా చులకన చేసి మాట్లాడుతున్నారని వాపోయారు. కాగా, ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే క్రాస్ ఓటింగ్ జరిగిందని నిర్ధారణ అయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తమకు 7 సీట్లు రాకపోవడాన్ని బట్టి చూస్తే చంద్రబాబు.. తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని అర్థం అవుతోంది అని తెలిపారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.