దివంగత రాజేశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్ఆర తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ.. వైఎస్సార్కి వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ప్రస్తుతం వైఎస్సార్ బతికి ఉంటే.. కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవాడంటూ.. ఘాటు విమర్శలు చేశారు షర్మిల. ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా షర్మిల కాంగ్రెస్ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోసం 30 ఏళ్లు కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పాదయాత్ర చేశారు. ప్రజలు ఆయనను ఆశీర్వదించి.. రెండు సార్లు అధికారం ఇచ్చారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ అధికారంలోకి తీసుకువచ్చారు. అలాంటి రాజశేఖర్రెడ్డి చనిపోతే.. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది.. ఆయన దోషి అని.. ఏకంగా ఎఫ్ఐఆర్లో వైఎస్సార్ పేరు చేర్చింది. రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్ఆర్ పట్ల కాంగ్రెస్ పార్టీకి కనీసం కృతజ్ఞత ఉందా.. ఆయన బతికున్నప్పుడు ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడిన వారు.. చనిపోతే అలాంటి గొప్ప నేత పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. అంతటి ఘనులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు’’ అంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంతేకాక.. ‘‘మళ్లీ ఎన్నికలు రాగానే.. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం సిగ్గు లేకుండా.. రాజశేఖర్ రెడ్డి ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతుంది. ఇప్పుడు ఆ మహానేత బతికి ఉంటే.. కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖ్యాతిని తెచ్చారు కానీ, పార్టీ వల్ల ఆయనకు ఖ్యాతి రాలేదు. వైఎస్ఆర్ చనిపోయాక ఐదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏంచేయగలిగింది. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు ఆశీర్వదించారు’’ అని చెప్పుకొచ్చారు షర్మిల.