ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వాడీ వేడీగా ఉన్నాయి. ఏపీ రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈక్రమంలో రాజగోపాల్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరస్పర విమర్శలతో రెచ్చిపోయారు. ఈక్రమంలో రేవంత్ రెడ్డి.. కోమటి రెడ్డి సోదరులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపట్ల వెంకట రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ వెళ్లి..అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.
కాంగ్రెస్ లో జరిగిన కొన్ని తాజా పరిణామాలు సైతం కోమటి రెడ్డి వెంకట రెడ్డికి అసహనం కలిగించాయి. రేవంత్ రెడ్డి.. చెరుకు సుధాకర్ను కాంగ్రెస్లో చేర్చుకోవడంపై కోమటి రెడ్డి ఫైర్ అయ్యారు. తనను ఎన్నికల్లో ఓడించాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. రేవంత్రెడ్డి పెద్ద తప్పు చేశారని వ్యాఖ్యానించారు. ఇకపై రేవంత్రెడ్డి ముఖం కూడా చూడనని వెంకట్రెడ్డి అన్నారు.
పార్లమెంట్ సమావేశాల తర్వాత మునుగోడు వెళ్తానని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ ఇంటి పార్టీ అధినేత చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో రాహుల్ గాంధీ సమక్షంలో శుక్రవారం ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. చెరుకు సుధాకర్ తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినట్లు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. మరి.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.