ఏపీలో ఎన్నికల రాజకీయాలు వేడెక్కుతున్న నేపథ్యంలో ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇందులోకి దిగారు. ఏపీలో వరుస పర్యటనలు చేస్తూ.. ఛాయ్ పే చర్చా పెట్టారు. ఓటర్లను కలుసుకుంటూ వారితో చిట్ చాట్ చేశారు. అంతే కాదు వారికి ఏపీలో జరుగుతున్న రాజకీయాన్ని వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాజకీయ నాయకులు, పొత్తులు అంటూ సాగుతున్న ఇతర పార్టీల రాజకీయానికి భిన్నంగా.. సాధారణ జనంతో సమావేశమవుతున్నారు. తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఏ జరుగుతుందో వారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేఏ పాల్. చంద్రబాబు, జగన్, పవన్ కన్నా ప్రజల సపోర్ట్ తనకే ఎక్కువ ఉందన్నాడు. గుంటూరులో పర్యటించిన ఆయన మరోసారి పవన్ కళ్యాణ్కు స్పెషల్ ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనతో కలిసి వస్తే.. ఆయనను ముఖ్యమంత్రిని చేస్తాను అన్నాడు.
ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. ‘‘జగన్కు నేను జీవితంలో సపోర్ట్ చేయను. కేసీఆర్కు కళ్లు నెత్తి మీదకు వచ్చాయి. కాబోయే తెలంగాణ సీఎం నేనే. స్పెషల్ ప్యాకేజ్, స్టేటస్ కేంద్రం ఏపీకి ఇవ్వడం లేదు. నేనే ప్రధాని అయితే తెలుగు రాష్ట్రాలకు మహర్థశ వచ్చేది. జగన్ మూడు సంవత్సరాలలో అప్పులు మాత్రమే చేశారు. తమ్ముడు పవన్ నాతో కలిస్తే ముఖ్యమంత్రిని చేస్తాను. బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలంటే నా పార్టీని గెలిపించాలి’’ అన్నారు.
ఇక ప్రజలు తననే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీలో సీఎం జగన్ కలిసి పయనిస్తే అభివృద్ధి ఉండేదని, కానీ కలిసి నడవడానికి వారు ససేమిరా అంటున్నారన్నారు. తెలంగాణలో తనపై దాడి జరగడంతో రాజకీయ చిత్రం మారిపోయిందన్నారు. ఒక్క దెబ్బతో 30 లక్షల ఓటర్లు ప్రజాశాంతి పార్టీ వైపు వచ్చారన్నారు. దేశంలో శ్రీలంక పరిస్థితులు రాక ముందే మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ ను చిత్తుగా ఓడించాలన్నారు. తాను తెలంగాణ నుంచి పోటీచేస్తానన్నారు.
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనంలా రాష్ట్రంలోనూ పాలన మారబోతుందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు. మోదీ స్పెషల్ స్టేటస్ ఇవ్వడం లేదన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీని వదిలి పెట్టి తనతో కలిసి రావాలని పిలునిచ్చారు. జగన్ మూడేళ్ల పాలనలో చేసిందేమీ లేదని ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు మాత్రం మిగిలిందన్నారు. ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. కేఏ పాల్ కామెంట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.