సాధారణంగా మన దేశంలో సినీ, రాజకీయ రంగాల్లో వారసులు అధికంగా కనిపిస్తారు. కుటుంబం నుంచి ఒక్కరు సక్సెస్ అయితే చాలు.. ఇక పొలోమంటూ కట్టకట్టకుని వస్తారు వారసులు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా సరే.. వారు మాత్రం పట్టించుకోరు. అయితే ఈ వారసత్వం అనేది కేవలం వారి ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గెలుపోటములు.. పూర్తిగా వారసుల ప్రతిభ, సామర్థ్యాల మీదనే ఆధారపడి ఉంటుంది. వారసులుగా ఎంట్రీ ఇచ్చినా సరే… వారి కంటూ సొంత టాలెంట్ లేకపోతే.. అనతి కాలంలోనే కనుమరుగు కావాల్సి వస్తుంది. అలా కనిపించకుండా పోయినా వారసులు కూడా ఎందరో ఉన్నారు. మరికొందరు మాత్రం.. ఆశ చావక.. సక్సెస్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే.. నారా లోకేష్.
తాత ఏకంగా పార్టీ స్థాపించి.. నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చాడు. దేశాన్ని పదుల సంవత్సరాల పాటు ఏలిన జాతీయ పార్టీని సునాయాసంగా ఓడించాడు. ఇక తండ్రిని చూస్తే.. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర.. ఉమ్మడి ఏపీకి 9 ఏళ్ల పాటు.. విభజన తర్వాత ఏపీకి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశాడు. అలాంటి ఇంట నుంచి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేష్.. భవిష్యత్తు మాత్రం అగమ్యగోచరంగా ఉంది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రిగా చేశాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన విమర్శలను తిప్పి కొట్టడం కోసం 2019 ఎన్నికల్లో బరిలో నిలబడ్డాడు. కానీ ఓటమి పాలయ్యాడు. మరో ఏడాదిన్నరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో.. రాజకీయ భవిష్యత్తు గురించి లోకేష్ సీరియస్గా ఆలోచిస్తున్నాడట. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలో లోకేష్ మంగళగిరికి గుడ్బై చెప్పనున్నారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
కొన్ని రోజుల క్రితం లోకేష్ చేసిన వ్యాఖ్యలతోనే ఆయన రానున్న ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయరనే ప్రచారం ఉపందుకుంది. ఇటీవల మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం ఎక్కడ నుంచి పోటీ చేయమని చెప్తే.. అక్కడ నుంచి బరిలో దిగుతానని తెలిపాడు. దాంతో రానున్న ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయరనే ప్రచారం ఊపందుకుంది. దీనికి తగ్గట్టుగానే చాలా రోజులుగా లోకేష్ మంగళగిరిలో పర్యటించడం లేదు.
2019 ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశాడు. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక్రిష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలు కావటంతో ఆయన పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. దొడ్డి దారిన తప్ప.. సొంతంగా గెలవలేడు.. ఇది లోకేష్ బలం అంటూ ఎద్దేవా చేయసాగారు అధికార పార్టీ నేతలు. వీటికి చెక్ పెట్టాలంటే తాను మంగళగిరిలోనే పోటీ చేసి గెలవాలని బలంగా డిసైడ్ అయ్యాడు లోకేష్. అయితే రోజులు గడుస్తున్న కొద్ది.. మంగళగిరిలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. పార్టీలో కీలక నేతలు.. వైసీపీలో చేరారు. గతంలో టీడీపీ హయాంలో గుర్తింపు నోచుకుని బీసీ నేతలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దీనికి తోడు ఇక కరోనా కాలంలో నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్కు పరిమితం అయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో సొంత పార్టీ నేతల్లోనే లోకేష్ తీరుపై తీవ్ర అసంతృప్తి ఉంది.
ప్రస్తుతం మంగళగిరిలో పరిస్థితులు పూర్తిగా వైసీపీకి అనుకూలంగా మారటంతో.. లోకేష్ ఆలోచనల్లో మార్పువచ్చినట్లుగా చెబుతున్నారు ఆయన సన్నిహితులు. అంతేకాక ఈ సారి ఎన్నికల్లో గెలవడం తప్పనిసరి అని లోకేష్ భావిస్తున్నారట. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తనకు సూట్ అయ్యే నియోజకవర్గం ఏమిటి.. ఎక్కడ నుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తాను అన్న దానిపై పెద్ద ఎత్తున సర్వేలు చేయిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిలో భాగంగానే.. రానున్న ఎన్నికల్లో.. లోకేష్ విజయవాడ తూర్పు, పెనుమలూరు, విశాఖ సిటీలోని నియోజకవర్గాలు, భీమిలీ, హిందూపురంలో ఎక్కడి నుంచి పోటీచేసినా గెలుపు ఖాయమని సర్వేలో వెల్లడికావడంతో.. లోకేష్ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అవసరమైతే.. మామ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం అసెంబ్లీ స్థానాన్ని లోకేష్కు ఇచ్చేసి.. ఆయనను లోక్సభ బరిలో దింపితే.. చినసారు గెలవడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు టీడీపీ ఆశాకిరణం, భవిష్యత్తుగా చెప్పుకునే లోకేష్.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం సర్వేలు చేయించుకోవడం, నియోజకవర్గం మార్చుకోవడం ఏంటని తెలుగు తమ్ముళ్లు ఫీలవుతున్నారట. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.