దేశంలో భవిష్యత్లో “ప్రజాఫ్రంట్” రావాలని టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఆదివారం నాటి ప్రెస్మీట్ లో కేసీఆర్.. ప్రధాని నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. దేశానికి కొత్త రాజకీయ పార్టీ అవసరం అని ప్రజలు కోరుకుంటే.. పార్టీ పెడతానని ప్రకటించారు. అంతేకాక దేశంలో రాజకీయ పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ బృందం సర్వే నిర్వహిస్తోందని, తెలంగాణలో కూడా పీకే టీమ్ సర్వే చేస్తున్నారని, ఇప్పటికే టీఆర్ఎస్ కూడా విడిగా సర్వేలు చేయిస్తోందని, పీకే సర్వే ఎలా ఉంటుందో చూస్తామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
2019 లోక్ సభ ఎన్నికల ముందు నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘సారు.. కారు.. 16’ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మన మీద ఉత్తరాది వారి పెత్తనం ఏంటి.. కేంద్రంలో అధికారం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యనే ఎందుకు ఉండాలి.. మూడో పార్టీ అవిర్భావం ఎందుకు జరగకూడదు.. ప్రజలు దీవిస్తే.. తాను ఢిల్లీ గద్దెపై కూర్చుంటాను అని కేసీఆర్ 2019 లోక్ సభ ఎన్నికల ముందు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే ప్రయత్నం చేశాడు. కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.
ఇది కూడా చదవండి : 2024 ఎన్నికల కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్!
ఇన్ని రోజులు ఈ అంశంపై నోరు విప్పని కేసీఆర్ తాజాగా ఆదివారం జరిగిన ప్రేస్ మీట్ లో బీజేపీ సర్కార్ మీద నిప్పులు చెరుగుతూ.. జాతీయ స్థాయిలో పార్టీ పెడతానన్నాడు. ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించానని తెలిపాడు. ప్రాంతీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నానని మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడానన్నారు. ఉద్దవ్ థాకరేతో త్వరలో భేటీ అవుతానని ప్రకటించారు. కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో మరోసారి జాతీయ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాల పాత్ర తెర మీదకు వస్తోంది.
గతంలో ప్రయత్నాలు..
కేసీఆర్ కన్నా ముందే.. పలువురు దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నేతలు జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించాలని ఆశించారు. ఆ జాబితాలో తొలుత కనిపించే పేరు ఎన్టీఆర్. 1984 లోక్సభ ఎన్నికల్లో 30 ఎంపీ సీట్లు గెలవడంతో లోక్సభలో ప్రతిపక్షంగా నిలబడింది. ఈ భారీ విజయంతో ఎన్టీఆర్ ఏకంగా ప్రధాని పదవి చేపట్టాలని భావించారు. కానీ ఆ తరువాత 1989 లోక్సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే టీడీపీ పరిమితం అయిపోయింది. ఆ తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీకి మద్దతు ఇవ్వడంతోనే సరిపోయింది.
ఇది కూడా చదవండి : జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్.. ఆ ఎన్నికల తర్వాత ప్రకటన
దక్షిణాది నుంచి ప్రధానిగా పూర్తి ఐదేళ్ల కాలం పని చేసిన వ్యక్తి పీవ నరసింహారావు. 1991 నుంచి 1996 దాకా కాంగ్రెస్ తరఫున ప్రధానిగా పని చేశారు. అయితే ఆయన పదవీకాలంలో దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఆయన పని చేశారు. ఇక తమిళనాడు నుంచి జయలలిత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని.. ప్రధాని పదవి చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నించినప్పటికి.. ఫలితం దక్కలేదు. చివరకు ఆమెకు కేంద్రంలో కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచారు.
కేసీఆర్ తో కలిసి వస్తారా…
తాజాగా కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాల్లో దక్షిణాది ప్రస్తావన తీసుకువచ్చారు. అయితే ఆయన అన్నట్లు.. ప్రస్తుత తరుణంలో దక్షిణాది రాష్ట్రాల పార్టీల నేతలను కలుపుకుని జాతీయ రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ ఎవరి లెక్కలు వారికున్నాయి. కేంద్రంతో ఎలా ఉండాలి.. రాష్ట్రంలో ఎలా వ్యవహరించాలి అనే దాని గురించి ప్రతి పార్టీకి స్పష్టమైన అభిప్రాయం ఉంది. దక్షిణాది నేతలంగా కేసీఆర్ తో కలిసి రావడం అనేది ఊహ మాత్రమే. ఇక అటు ఉత్తరాన దీదీ, శరద్ పవార్ వంటి నేతలు కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నయంగా మూడో ఫ్రంట్ తీసుకురావాలని బలంగా ప్రయత్నిస్తున్నారు. కానీ వాస్తవంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నట్లు అర్థమవ్వడంతో.. ఇప్పుడు ఆ ఆలోచనను పక్కకు పెట్టారు.
ఇది కూడా చదవండి : టీఆర్ఎస్ vs బీజేపీ.. నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు
వ్యూహకర్త ప్రశాంత్ కిశోరే స్వయంగా.. దేశంలో మూడో ఫ్రంట్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అన్నింటికి మించి.. కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పెత్తనాన్ని ప్రజలు అంగీకరించరు. గత అనుభవాల దృష్ట్యా వారు ప్రాంతీయ పార్టీలకు కేంద్రంలో అధికారం అప్పగించే ఆలోచన చేయరని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి జాతీయ రాజకీయాల్లోకి వస్తానంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎప్పటిలానే గాల్లో కలిసిపోతాయా.. లేక ఆచరణలో పెట్టి.. నిజంగానే జాతీయ స్థాయిలో పార్టీ స్థాపించి.. ప్రధాని పదవి చేపడతారా అనేది చూడాలి. కేసీఆర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.