గత కొన్ని రోజులుగా నటుడు, కమెడియన్ అలీ వైసీపీ పార్టీని వీడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయన ఈ వార్తలను ఖండించారు. వైసీపీ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని, తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని అలీ ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాను పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని, జగన్ అంటే ఇష్టం కనుక.. జగన్ ని సీఎం చేయాలన్న లక్ష్యంతో వైసీపీలో చేరానని అన్నారు. పదవులేవీ తనకు ముఖ్యం కాదని, జగన్ మనసులో స్థానమే తనకు ముఖ్యమని వెల్లడించారు. మరోసారి జగన్ సీఎం అయ్యేందుకు కృషి చేస్తానని అలీ పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో అలీ వైసీపీలో చేరారు.
అలీ జన్మస్థలం రాజమండ్రి గనుక.. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, టికెట్ జగన్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా అలీకి ఇవ్వలేదు. ఆ తర్వాత నామినేటెడ్ పదవి ఇస్తారని, రాజ్యసభకు పంపుతారని ఇలా అలీ విషయంలో వార్తలు వచ్చాయి. వాటన్నిటినీ అలీ ఖండిస్తూ వచ్చారు. తనకి రాజ్యసభ సీటు మీద ఆశ లేదని, దాని కోసం ఆశించలేదని గతంలో వెల్లడించారు. ఆ మధ్య కమెడియన్ పృథ్వీ వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఈ కోవలోనే అలీ కూడా వచ్చేస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే వీటన్నిటికీ ధీటుగా బదులిచ్చారు అలీ. పార్టీని వీడే సమస్యే లేదని, జగన్ ని మరోసారి సీఎం చేయడం కోసం అంకితభావంతో పని చేస్తానని స్పష్టం చేశారు.
గతంలో కూడా ఈ విషయంపై అలీ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. జగన్ దృష్టిలో తాను కూడా ఉన్నానని, పలానా పదవి ఇస్తానని జగన్ ఎప్పుడూ హామీ ఇవ్వలేదని, అయితే ఏదో ఒక పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ నమ్మకంతోనే వైసీపీలో ఉన్నానని అలీ అన్నారు. భవిష్యత్తులో ఏ పదవి ఇచ్చినా తాను బాధ్యతగా స్వీకరిస్తానని అలీ తెలిపారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవి కూడా తనకు ఇవ్వడం లేదని, ఇప్పటికే ఆ పదవి వేరే వాళ్లకు కేటాయించడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నుంచి ఒక రోజు తనకు పిలుపు వస్తుందని, ఆరోజు మీడియా ముందు వస్తానని అలీ ప్రకటించిన విషయం తెలిసిందే.