ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం జనగామలో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని, జిల్లా టీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం సాయంత్రం యశ్వంత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. కేంద్ర సర్కార్ పై, బీజేపీపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.
‘‘సమైక్య పాలనలో నష్టపోయిన తెలంగాణ మనం పెట్టుకున్న పాలసీలతో మెరుగుపడుతోంది. రైతుబంధు ఇస్తున్నాం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా 8 రోజుల లోపు రూ.5లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నాం. రాష్ట్రం వచ్చి 8 ఏళ్లు అయింది. 30.. 40ఏళ్లు కరెంటు లేక, నీళ్లు రాక ఇబ్బంది పడ్డాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపుకొంటున్నాం. రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నాం. హైదరాబాద్ వెళ్లిన వారు తిరిగి గ్రామాలకు వాపస్ వస్తున్నారు. కానీ, ప్రధాని నరేంద్రమోదీ విద్యుత్ సంస్కరణల పేరిట ప్రతి మోటార్ కు మీటరు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారు. నన్ను చంపినా సరే మోటార్ కు మీటరు పెట్టేది లేదు’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రంపై వార్ డిక్లేర్ చేసిన #CMKCR pic.twitter.com/IIrB5ZTcM4
— TV9 Telugu (@TV9Telugu) February 12, 2022
‘‘కేంద్రం డీజిల్, గ్యాస్, ఎరువుల ధరలు అడ్డగోలుగా పెంచింది. దీంతో రైతులు పెట్టుబడి రెట్టింపు అయింది. తెలంగాణ ప్రజలు ఇచ్చిన శక్తితోనే ఇంతదూరం వచ్చాం, కేంద్రంపై తిరగబడతాం.. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కొట్లాడతాం. మేము రైతు బంధు ఇస్తుంటే కేంద్రం రైతులు పెట్టుబడి ధరలు పెంచుతోంది. ప్రాజెక్టులకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వడు, వైద్య కళాశాలలు ఇవ్వదు. దాన్యం కొనబోమని కేంద్రం చెబుతోంది. మోదీ ప్రభుత్వం రైతులు వెంటపడింది. కుంభకోణాలు చేసిన వారిని విమానాల్లో విదేశాలకు పంపారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వస్తే అందరం కొట్లాడతాం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం. మీరందరూ దీవిస్తే ఢిల్లీ కోటలు బద్దలుకొడతా. జాగ్రత్త మోదీ.. ఇది తెలంగాణ ఉడుత ఊపులకు భయపడేది లేదు. బీజేపీ వాళ్లను మేం టచ్ చేయం.. మమ్మల్ని టచ్ చేస్తే నాశనం చేస్తాం” అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.