తెలంగాణ అసెంబ్లీలో పల్లె, పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి పలు కీలక అంశాలు మాట్లాడారు. ఈ సందర్భంగ బీజేపీ, కాంగ్రెస్ లపై తనదైన స్టైల్లో మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను హరించడంలో బీజేపీ, కాంగ్రెస్లు దొందు దొందే అని వ్యాఖ్యానించారు. ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడుగా ఈ మాట చెబుతున్నానని సీఎం వెల్లడించారు. తెలంగాణ విషయంలో ఎంతో అన్యాయం జరుగుతుందని గొంతెత్తి అరుస్తున్నాం.. అయినా కేంద్రం పట్టించుకోవడం లేదు అన్నారు.
తెలంగాణ నుంచి కేంద్రానికి పోయే నిధులు ఎక్కువ.. అక్కడి నుంచి వచ్చేవి తక్కువని పేర్కొన్నారు. రాష్ట్రాల హక్కులు కాపాడుకోడానికి కేంద్రంతో పోరాటం చేస్తామని చెప్పారు. ఈ విషయమై తమిళనాడు సీఎం స్టాలిన్ తనకు లేఖ రాసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతీ గ్రామానికి పంచాయితీ సెక్రటరీని పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వాలు చెట్లు పెట్టలేదు- అభివృద్ధి చెయ్యలేదు ఇప్పుడు తాము రెండూ చేస్తున్నామని సీఎం అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకొంటుందని చెప్పారు కేసీఆర్.
రైతుబంధు, రైతు భీమాతో పాటు అనేక పథకాలను తీసుకొచ్చిన విషయాన్ని సీఎం తెలిపారు. పల్లె- పట్టణ ప్రగతి ప్రోగ్రాం ద్వారా 2లక్షల 33వేల పోల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో బోరుబావుల్లో పిల్లలు పడి మృత్యువాత పడేవారని.. గడిచిన ఏడాదిన్నర నుంచి బోరుబావుల్లో పిల్లలు పడ్డ ఘటనలు జరగడం లేదని సీఎం వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బోరుబావులను పూర్తిగా మూసి వేయించినట్లు తెలిపారు. కరోనా వల్ల లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని.. మహమ్మారి రాకపోతే రాష్ట్రం అభివృద్ధి బాగా ఉండేదని కేసీఆర్ చెప్పారు.