తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిపక్ష పార్టీలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. దళిత బంధు పథకంపై ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ విపక్ష పార్టీలకు అంతుచిక్కని వ్యూహాన్ని అమలు చేశారు. ఇక భూ కబ్జా ఆరోపణలతో కారు దిగి బీజేపీలోకి వెళ్లారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్. దీంతో ఆయన హుజురాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ క్రమంలోనే ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఎలాగైన ఇక్కడ గెలవాలని కంకణం కట్టుకున్నాయి తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలు.
ఇక ఒక పక్క ఈటెల రాజేందర్ తన నియోజకవర్గంలో పాదయాత్రతో రాజకీయంగా కాస్త హీట్ పెంచే పక్రియలో భాగమవుతున్నాడు. ఎలాగైన ఈటెలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ వేయని ఎత్తులు లేవనే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలోనే దళిత బంధు అనే పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం. ఈ పథకాన్ని హుజురాబాద్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు చేసి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రతిపక్షాల నుంచి విపరీతమైన వ్యతిరేకత మొదలైంది.
హుజురాబాద్లో ఉప ఎన్నిక రావటం మూలంగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని, ఈ పథకంతో దళితులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇక ఇక్కడే కేసీఆర్ తన వ్యూహానికి పదును పెట్టాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలో వాసాలమర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో పలుమార్లు ఆ గ్రామాన్ని సందర్శించి ప్రజలతో ముఖాముఖి జరిపారు. ఇక ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుండటంతో దళిత బంధు పథకాన్ని వాసాలమర్రిలో ప్రయోగించి ప్రతిపక్షాల నోళ్లకు చెక్ పెట్టారు. దీంతో వాసాలమర్రిలో 76 దళిత కుటుంబాలకు రూ.10 లక్షల నగదును వారి అకౌంట్లోకి బదిలి చేశాడు. ఈ దెబ్బతో దళిత బంధు పథకంపై వస్తున్న ఆరోపణలకు చెక్ పట్టినట్లు అయింది.