దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆమేరకు ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా జాతీయ పార్టీ పేరు ప్రకటిస్తారనే ఊహాగానాలు జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీ గురువారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ కోసం ప్రత్యేకంగా చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. దేశరాజకీయాల్లో కీలకంగా మారాలని భావిస్తోన్న సీఎం కేసీఆర్.. ఆ దిశగా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలా ఇతర రాష్ట్రాల సీఎంలు, నేతలను కలవడం కోసం వెళ్లిన ప్రతి సారి.. అద్దె విమానంలో వెళ్లాల్సి వస్తోంది. దానిబదులు సొంతంగా విమానం తీసుకుంటే మంచిదని టీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.
సీఎం కేసీఆర్ కోసం కొనుగోలు చేయబోయే ప్రత్యేక చార్టెర్డ్ ఫ్లైట్ కోసం దాదాపు రూ.80 కోట్లను వెచ్చించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. ఇక ఈ విమానంలో 12 సీట్లుంటాయి. దసరా రోజునే చార్టెర్డ్ ఫ్లైట్ కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వనున్నారు. అక్టోబరు 5న దసరా సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త పార్టీ పేరు ప్రకటిస్తారు. ఆ ప్రకటన తర్వాత ప్రత్యేక విమానం కొనుగోలుకు టీఆర్ఎస్ పార్టీ ఆర్డర్ ఇస్తుందందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ఖజానాలో దాదాపు రూ.900 కోట్ల మేర నిధులున్నట్లు సమాచారం. అయితే సొంత విమానం కోసం ఆ డబ్బును ఖర్చుచేయకుండా.. పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి విరాళాలు సేకరించాలని టీఆర్ఎస్ నిర్ణయించిందట.
జాతీయ రాజకీయాలపై దృష్టిసారించిన సీఎం కేసీఆర్ గత కొంత కాలంగా పలు దఫాలుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటనలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, కీలక నేతలతో భేటీ అవుతూ.. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే ఇలా ఆయా రాష్ట్రాల పర్యటనలకు వెళ్లేటప్పుడు ప్రైవేటు విమానాలను అద్దెకు తీసుకొంటున్నారు. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ స్థాపనంలో భాగంగా సొంత విమానం అవసరమని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. దసరా రోజున విమానం కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.