ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయల్లో ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నేతలు ఎప్పుడు ఎలా స్పందిస్తారో తెలియదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే సమయంలో జగన్ గాల్లోనే వచ్చి గాల్లోనే కలిసిపోతాడని చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ సీఎం జగన్ స్పందించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలకు సీఎం జగన్ చెక్ పెట్టారు. తన పర్యటన కారణంగా అధికార యంత్రాంగం చేస్తోన్న సహాయక కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడకూడదనే.. అందుకే వరద ప్రభావిత ప్రాంతాల్లో పరామర్శలకు వెళ్లలేదన్నారు. పరిస్థితి కుదుటపడిన తర్వాత తాను తప్పనిసరిగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. సాయం అందిందో? లేదో? అడిగి తెలుసుకుంటానని జగన్ తెలిపారు. ‘నేను గాల్లోనే వచ్చి గాల్లోనే కలిసిపోతానంట.. తనను వ్యతిరేకించిన వైఎస్సార్ కూడా కాలగర్భంలో కలిసిపోయారు అని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు, వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష నాయకుడు.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు గారి సంస్కారానికి నా నమస్కారం’ అని సీఎం జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
కడప జిల్లా పింఛా, అన్నమయ్య రిజర్వాయర్ల దిగువ భాగంలో భారీ వరద వచ్చింది. పింఛా రిజర్వాయర్లో అత్యవసర గేట్లు ఎత్తినా వరద అధికంగా వచ్చింది. ఇలా పింఛా జలశయం నుంచి వచ్చిన వరద నీరు ఒక్కసారిగా అన్నమయ్య రిజర్వాయర్ పై పడింది. అంతకు ముందే అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ‘1,250 కుటుంబాలను అప్రమత్తం చేసి.. 450 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు.. 900 మందిని పునరావాస కేంద్రాలకు తరలించాం’ అని సీఎం జగన్ తెలిపారు. అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారని. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడు విమర్శలు గుప్పించడం సరికాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.