రాజకీయాల్లో రాణించాలంటే.. ముందుగా ఉండాల్సిన ప్రధాన లక్షణం.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి కష్టాలు తెలుసుకోవడం.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ముఖ్యం. సినిమా అయినా రాజకీయాలైనా సరే.. దూకుడుగా ఉంటేనే గుర్తింపు. లేదంటే.. ప్రజలు మర్చిపోతారు.. మనం తెరమరుగవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే రాజకీయానాయకులు నిత్యం ఏదో సమస్యపై స్పందిస్తూ.. ప్రజల్లో ఉంటారు. మరీ ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తోన్న వేళ.. చిన్నా పెద్దా పార్టీల నేతలంతా స్పీడు పెంచుతారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి.. దూకుడు కనబరుస్తారు. ఇక అధికార పార్టీ కాస్త బలంగా ఉంటే.. ప్రతిపక్షాలు మరింత బలంగా ఢీకొట్టే ప్రయత్నం చేస్తాయి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు చూస్తే.. ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్లు అర్థం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. దాంతో ప్రతిపక్ష టీడీపీ స్పీడు పెంచింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. వరుస పర్యటనుల చేపడుతూ.. ప్రజల్లో ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనతో ప్రారంభించిన ఈ యాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాకు చేరుకుంది. ఈ పర్యటనల్లో చంద్రబాబుకు ఆదరణ కూడా బాగానే లభిస్తోంది. ఇక అధ్యక్షుడే రంగంలోకి దిగడంతో.. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపినట్లయ్యింది. చంద్రబాబు పర్యటనలు వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఎంతో కొంత మైలేజీ సాధిస్తాయని తెలుగు తమ్ముళ్లు నమ్ముతున్నారు. అయితే ఇక్కడ టీడీపీ కార్యకర్తలను ఓ అంశం కలవరపెడుతోంది. అదేంటంటే.. లోకేష్ మౌనం.
అవును చంద్రబాబు వయసు ప్రస్తుతం 72 సంవత్సరాలు. మహా అయితే మరో ఐదేళ్ల పాటు.. రాజకీయాల్లో క్రియాశీలకంగా రాణించగలుగుతారు. మరి తర్వాత పార్టీ బాధ్యతలు, బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత.. చంద్రబాబు నాయుడి కుమారుడైన లోకేష్ మీదనే ఉంది. కానీ ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూసి.. లోకేష్ తీరుపై తెలుగు తమ్ముళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వయసు పైబడినా సరే.. చంద్రబాబు నాయుడు.. వరుస పర్యటనలు చేపడుతూ.. అధికార పార్టీపై దూకుడుగా విమర్శలు చేస్తూ.. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. వయసు మీద పడినప్పటికి ఏమాత్రం లెక్క చేయకుండా.. యువతతో పోటీ పడుతున్నారు చంద్రబాబు.
మరోవైపు పార్టీ భవిష్యత్తు నేతగా భావిస్తోన్న లోకేష్ మాత్రం గత కొన్ని నెలలుగా ప్రజా క్షేత్రంలో కనిపించలేదు. వచ్చే ఏడాది జనవరి నుంచి లోకేష్ పాదయాత్ర చేస్తారని కొన్ని రోజుల వరకు జోరుగా ప్రచారం జరిగింది కానీ.. ఆ దిశగా ఎలాంటి కార్యచరణ ముందుకు సాగడం లేదని అర్థం అవుతోంది. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాల్సిన వ్యక్తి.. ఇంత నిర్లప్తంగా ఉండటం.. పార్టీ కార్యాకలపాల్లో చురుగ్గా వ్యవహరించకపోవడం పట్ల తెలుగు తమ్ముళ్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇంత వయసులో కూడా చంద్రబాబు.. పార్టీని బలోపేతం చేయడం కోసం ఇంతలా శ్రమిస్తుంటే.. లోకేష్ మాత్రం.. ఇలా ఏం పట్టనట్లు ఉండటం ఏంటని చర్చించుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీని బలోపేతం చేసుకోవాలన్నా.. పార్టీని బతికించుకోవాలన్నా.. యువరక్తం కావాలి. యంగ్ జనరేషన్ని పార్టీ వైపు ఆకర్షించాలి. ఆ బాధ్యత లోకేష్ది. కానీ చినబాబు మాత్రం.. ఆ దిశగా అసలు ఆసక్తే చూపడం లేదు. పార్టీని బలోపేతం చేయడం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దూకుడుగా ముందుకు వెళ్లడం లేదు. లోకేష్ తీరు మార్చుకోకపోతే.. ఆయనే స్వయంగా టీడీపీకి నష్టం చేకూర్చినట్లు అవుతుందని అంటున్నారు. మరి ఇప్పటికైనా పార్టీ పెద్దలు ఈ దిశగా ఆలోచించి.. ఏవైనా చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి.