ప్రముఖ నటి, మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్ కౌర్ రాణాకు బోంబే హైకోర్టు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఈ చర్య తీసుకుంది. ఆమె విదర్భలోని అమరావతి నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యురాలు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్ సర్టిఫికేట్తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ కౌర్ తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్లైంది.
గత మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్ సభ లాబీలో బెదిరించారని మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారని ఆమె నాడు వెల్లడించారు. తనపై యాసిడ్ దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్తో పాటు శివసేన లెటర్ హెడ్తో లేఖలు కూడా వస్తున్నాయంటూ నవనీత్ కౌర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ శివసేన అభ్యర్థి ఆనందరావు అదసూల్ పైనే విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన నవనీత్కౌర్ ఎన్సీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అమరావతి లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నవనీత్ అమరావతిలో బద్నేరాకు చెందిన ఎమ్మెల్యే రవి రాణా భార్య. కన్నడ చిత్రం ‘దర్శన్ ’చిత్రంతో నవనీత్ సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో శ్రీను వాసంతి లక్ష్మితో పాటు పలు చిత్రాల్లో నటించారు. నవనీత్ కౌర్ తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళం, మళయాలం, పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు.