ఏపీ సీఎం జగన్ ఏం చేసినా అందులో ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్న చందాన ఉంటుంది జగన్ తీరు. అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకునే వ్యక్తి కావడంతో.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనుకుంటారు. కేవలం ఏదో ఒక జిల్లా కాకుండా అన్ని జిల్లాలు బాగుపడాలనేది జగన్ ఫిలాసఫీ. ఈ క్రమంలోనే ఒక జిల్లాకి చెందిన విమానాశ్రయాన్ని రెండు జిల్లాలకు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్ వేశారు. నెల్లూరు పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి విమానాశ్రయాన్ని దగదర్తిలో కాకుండా.. రెండు జిల్లాలకు ఉపయోగపడేలా మరో చోట ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా దగదర్తి విమానాశ్రయాన్ని అక్కడి నుంచి జిల్లా కందుకూరు ప్రాంతానికి తరలించాలని జగన్ నిర్ణయించారు. అటు ప్రకాశం జిల్లా, ఇటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ప్రజలకు ఉపయోగపడేలా.. రెండు జిల్లాల సరిహద్దుల్లో విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జగన్ తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు కందుకూరుకు 20 కి.మీ.ల పరిధిలో భూములను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఇప్పటికే వెయ్యి ఎకరాలను కందుకూరు సమీపంలో రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ఈ భూములను రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ పరిశీలిస్తుండగా.. ఈ విమానాశ్రయానికి ఏపీఏడీసీఎల్ అధికారులు నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి రోడ్డు అనుసంధానతను అధ్యయనం చేస్తున్నారు. మరి రెండు జిల్లాల సరిహద్దుల్లో విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.