ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాటి తిరుపతి జిల్లా పర్యటన సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తనకు వినతి పత్రం ఇచ్చేందుకు రోడ్డు పక్కన నిలుచున్న దంపతులను చూసిన జగన్.. తన కాన్వాయ్ ను స్లో చేయించి.. తన భద్రతా సిబ్బంది చేత ఆ దంపతులు నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ ఘటన సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే..
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన మహేశ్ 2019లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేయి విరిగిపోయింది. ఈక్రమంలో కాలు కూడా పనిచేయడం మానేసింది. వైద్యం కోసం రూ.7 లక్షలు ఖర్చు చేసుకున్నాడు. దీంతో ఉన్న ఆస్తి అంతా కరిగిపోయింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో గడుపుతున్న అతడు, మెడికల్ బిల్లు రీయింబర్స్మెంట్ కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం శ్రీకాళహస్తికి జగన్ వస్తున్నారని తెలిసి ఆయనకు తన బాధను చెప్పుకునేందుకు భార్యతో కలిసి సీఎం కాన్యాయ్ వెళ్లే రోడ్డు పక్కగా నిలుచున్నాడు. జగన్ తన పర్యటనను ముగించుకుని శ్రీకాళహస్తి నుంచి రేణిగుంటకు వెళుతున్న సమయంలో రోడ్డు పక్కగా వినతి పత్రాలు చేతబట్టుకుని నిలుచున్న దంపతులను చూసి తన కాన్వాయ్ను స్లో చేయించారు. తన భద్రతా సిబ్బంది ద్వారా దంపతుల నుంచి వినతి పత్రం తీసుకున్నారు. సీఎం తన భద్రతా సిబ్బందిని పంపడంపై యువకుడు ఆనందం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తరపు నుంచి ఏదో ఒక సాయం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.