ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుస్తు ఎన్నికల గురించి జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్లే అధికార, విపక్షాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణలో కూడా ముందస్తు ఎన్నికల అంశంపై ఊహాగానాలు కొనసాగుతుండగా.. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై పోరాడేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారని, జాతీయ స్థాయిలోనూ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు అందరినీ ఏకం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చిన డాక్టర్ అబ్రహం.. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని అటు రాజకీయ వర్గాల్లో ఇప్పటికే జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన, టీఆర్ఎస్ పార్టీ క్యాంపెయినింగ్ తీరు ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది. ఇక ఇటీవల సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్ జలాశయాన్ని జాతికి అంకితం చేసిన సందర్భంగా.. అంతకుముందు ఆందోల్లో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల శంకుస్థాపన సందర్భంగా, జనగామలో నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించిన తీరు ఎన్నికల ప్రచారాన్ని తలపించింది.
అంతేకాక రానున్న ఎన్నికల్లో ఆయా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి జనాలకు, నేతలకు ఓ క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో ముందస్తు ఎన్నికలపై క్లారిటీ వచ్చినట్లయింది. మరి కేసీఆర్ గతంలో మాదిరి ముందస్తు ఎన్నికలకు వెళ్తాడో, లేదో చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.