దేశంలో అధికారంలో ఉన్నరాజకీయ పార్టీలు తమ తమ ప్రభుత్వాలు చేస్తోన్న అభివృద్ధి పనుల గురించి హోర్డింగ్స్, ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకుంటాయి. వీటికి ప్రజా ధనాన్నే వినియోగిస్తాయి. అయితే అవి మితిమీరనంత వరకు సమస్య కాదూ కానీ, హద్దు మీరితేనే చిక్కు. ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రకటన ముసుగులో రాజకీయ ప్రచారాన్ని చేసుకున్నందుకు ఆప్ ప్రభుత్వానికి అసలుతో పాటు పెనాల్టీ కూడా పడింది.
ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనాకు పొసగడం లేదని బహిరంగ రహస్యం. ఇటీవల ప్రభుత్వ ప్రకటనలను తన రాజకీయ ప్రచారాలకు ఆప్ వినియోగించుకుందంటూ ముఖ్యమంత్రికి సక్సేనా నోటీసులు జారీ చేశారు. ఈ ప్రకటనలకు అయిన ఖర్చును రూ. 97 కోట్లు, దానికి వడ్డీ కలిపి రూ.163. 62 కోట్లు చెల్లించాలని పేర్కొన్నారు. దీంతో ఈ మొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని స్వంత ప్రభుత్వంలోని విభాగమైన డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డిఐపి) ఆప్ కు రికవరీ నోటీసు జారీ చేసింది.
2017 మార్చి 31 నాటికి ఆప్ ప్రభుత్వం చేసిన మొత్తం ఖర్చు రూ. 99.31 కోట్లు, దానిపై పెనాల్టీతో కలిపి మొత్తం 163,61,88,265 ఫైన్ కట్టాలని నోటీసులో పేర్కొంది. ఆప్ చెల్లించడంతో విఫలమైతే ఢిల్లీలోని దాని కార్యాలయాన్ని, ఆస్తులను సీల్ చేయవచ్చునని తెలిపింది. కాగా, దీనిపై ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పందించారు. ఢిల్లీలోని కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు దేశంలోని కేంద్రం ప్రభుత్వం.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. కాగా, ఢిల్లీ మున్పిపల్ ఎన్నికల్లో ఆప్ విజయం సాధించిన తర్వాత వికె సక్సేనా నోటీసులు పంపడం గమనార్హం. మరి ప్రభుత్వ విభాగమే ప్రభుత్వం మీద పెనాల్టీ విధించడంపై మీ అభిప్రాయమేమిటి? ఇష్టమొచ్చినట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వం మీద ఇలాంటి చర్యలు తీసుకోవడంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.