కేరళ- దేశంలో అత్యాచారానికి గురవతున్న ఎంతో మంది జీవితాలు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయి. కొంత మంది మళ్లీ కొత్త జీవితాలు ప్రారంభిస్తే, మరి కొంత మంది బతుకులు మాత్రం అన్యాయమైపోతున్నాయి. రౌడీగారి పెళ్లాం సినిమాలో మోహన్ బాబు చేత అత్యాచారానికి గురైన శోభన, పట్టుబట్టి అతన్నే పెళ్లి చేసుకుంటుంది. అచ్చు ఇలాగే కేరళలో తనపై అత్యాచారం చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది ఓ యువతి.
కేరళకు చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన కేసులో మాజీ కేథలిక్ ప్రీస్ట్ రాబిన్ వడక్కుంచెరి దోషిగా తేల్చారు. ఈ కేసులో అతనికి 20 ఏళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ 2019లో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన దోషిగా నిర్థరణ కావడంతో ప్రీస్ట్హుడ్ నుంచి చర్చి డిస్మిస్ చేసింది. కేరళ కేథలిక్ కుటుంబానికి చెందిన మైనర్ బాలిక 2016 మేలో పదో తరగతి చదువుతున్న రోజుల్లో ఈ దారుణ ఘటన జరిగింది.
ఆమెపై అత్యాచారం చేసిన ప్రీస్ట్ వడక్కుంచెరి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బాలికను శాసించాడు. 2017 ఫిబ్రవరి 7న ఆ బాలికకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరిక్షించిన వైద్యులు గర్భవతి అని నిర్ధారించారు. ఆ తరువాత ఆ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె తన తల్లికి వడక్కుంచెరి చేసిన దారణం గురించి చెప్పడంతో, ఆమె కుటుంబ సభ్యులు వడక్కుంచెరిని నిలదీశారు. అందుకు స్పందించిన ఆయన, ఆసుపత్రి బిల్లు 30 వేల రూపాయలు చెల్లిస్తానని చెప్పారు.
దీంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టు విచారణ అనంతరం అతనికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇదిగో ఇప్పుడు తన మైనారిటీ తీరాక, తనపై అత్యాచారానికి పాల్పడ్డ అతన్నే పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరి ఆమె విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు ఆసక్తిరేపుతోంది.