సర్గజ్ జిల్లాలోని ముత్కి గ్రామానికి చెందిన కిషన్ రామ్ రాజ్వాడా మంగళవారం మధ్యాహ్నం వర్షం కురుస్తుండగా తన ఇంటి ముందు నిలిచిన నీళ్లను తీసేందుకు బయటకు వచ్చాడు. ఇంతలో అతడు పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగు శబ్దం విని కుటుంబ సభ్యులు అరవగా.. ఇరుగుపొరుగువారు, ఊరిపెద్దలు అక్కడకు చేరారు. అయితే తీవ్రంగా గాయపడ్డ అతడిని వెంటనే హాస్పిటల్ కు తరలించకుండా ఆవుపేడతో తమకు తోచిన ట్రీట్మెంట్ చేశారు. కిషన్ శరీరం మొత్తాన్ని పేడలో ముంచి తల భాగాన్ని మాత్రమే బయటకు వదిలేసి ఉంచారు.అరగంట పాటు కిషన్ ని ఆవు పేడలోనే ఉంచారు. అలా చేస్తే అతడు కోలుకుంటాడు అని ఊహించారు. కానీ, వారి యత్నాలు ఫలించలేదు. కిషన్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. దీంతో 108కి ఫోన్ చేసి అంబులెన్సు ద్వారా ఉదయ్పుర్ లోని హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే కిషన్ మృతి చెందాడని అక్కడి డాక్టర్లు నిర్ధరించారు. పిడుగుపాటుకు గురైన వెంటనే ఆలస్యం చేయకుండా అతడిని హాస్పిటల్ కి తీసుకొచ్చుంటే బతికి ఉండేవాడని డాక్టర్లు తెలిపారు. గతంలో ఇలాగే ఛత్తీ్సగఢ్లో గ్రామస్థుల మూఢనమ్మకాలకు ఇద్దరు యువకులు బలయ్యారు. పిడుగుపాటుకు గురైనవారిని సకాలంలో ఆస్పత్రికి తరలించకుండా ఆవుపేడతో వైద్యం చేయడంతో వారు మృత్యువాత పడ్డారు.
ఈ ఘటన జస్పూర్ జిల్లాలో జరిగిన సంగతి తెలిసిందే . సునీల్ సాయి, చంపా రౌత్., మరో యువతి స్థానికంగా ఉన్న ఓ రైస్మిల్లులో పనిచేస్తుంటారు. వారు పిడుగుపాటుకు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ముగ్గురిని గ్రామస్థులు ఆస్పత్రికి తరలించకుండా ఆవుపేడతో వైద్యం చేశారు. పాదాల నుంచి మెడ వరకు వారిని ఆవుపేడలో కప్పెట్టారు. ఇలా చేస్తే కాలిన గాయాలు తగ్గుతాయన్నది వారి విశ్వాసం. కాసేపటి తర్వాత ఇది గమనించిన పక్క ఊరి వాళ్లు గ్రామస్థులను మందలించి బాధితుల్ని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆలస్యం కావడంతో ఇద్దరు మృతి చెందారు. యువతి మాత్రం కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది. పోలీసులు గ్రామస్థులపై కేసు నమోదు చేశారు.