దొరికినకాడికి దోచుకుంటున్నారు దొంగలు. నగదు, బంగారు వస్తువులతో పాటు ఖరీదైన వస్తువులు, అలాగే కారు, లారీ వంటి వాహనాలు తీసుకెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. అయితే బీహార్ దొంగల సంగతి చెప్పనక్కర్లేదు. మనిషికి తెలియకుండా పర్సే కాదూ.. అవసరమైతే.. అవయవాలు కొట్టేయగలరు. తాజాగా ఓ వింత దొంగతనానికి పాల్పడ్డారు.
దొంగతనాలే వృత్తిగా మార్చుకున్న దొంగలు.. వస్తువు చిన్నదా, పెద్దదా అని చూడరు. దొరికినంత దోచుకో అన్న పదానికి న్యాయం చేస్తుంటారు. ఇంట్లో డబ్బు, బంగారు వస్తువులతో పాటు ఖరీదైన వస్తువులు, అలాగే కారు, లారీ వంటి వాహనాలు తీసుకెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక్కోసారి ఈ దొంగతనాలు, దోపిడీల్లో అమాయకులైన ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ కొన్ని సార్లు వీరు చేసిన దొంగతనాల గురించి తెలిస్తే ఆశ్చర్యమేయక మానదు. ఈ దొంగల్లో కూడా బీహార్ దొంగల తీరు వేరయా అన్నట్లు ఉంటుంది. సూది మొన దగ్గర నుండి రైలు ఇంజన్ వరకు ఏదీ వదిలి పెట్టరు. ఇటీవల రైలు పట్టాలే కాదూ, ఇంజను, బ్రిడ్జీని కూడా మాయం చేశారు. తాజాగా మరో వింత దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతకు అదేమిటంటే..?
మామూలుగా మొబైల్ దొంగతనం చూసుకుంటాం కానీ మొబైల్ టవర్నే ఎత్తుకెళ్లడం గురించి విన్నారా? ఆ అంత ఎత్తు, బరువు ఉంటుంది అదెలా దొంగిలిస్తారండీ అని అనుకుంటున్నారా. అయితే అదీ కూడా దొంగతనం చేయొచ్చు అని నిరూపించారు బీహార్ దొంగలు. చేతివాటం ప్రదర్శించి మొత్తం టవర్లే లేపేశారు. ఈ దొంగతనం ఎలా జరిగిందో తెలియక.. ఆ సెల్ కంపెనీ, దాన్ని ఉంచిన భూ యజమాని అయోమయంలో పడ్డారు. ఈ ఘటన బీహార్లోని ముజఫర్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అదీ కూడా పట్ట పగలే ఈ దోపిడీకి పాల్పడ్డారట. శ్రమజీవి నగర్లో మనీషా కుమారి ఇంట్లో జీటీఏఎల్ కంపెనీ మొబైల్ టవర్ను గతంలో ఏర్పాటు చేశారు. ఈ పాత బడిన సెల్ టవర్ వద్దకు వచ్చిన దొంగలు.. తాము ఆ సంస్థకు చెందిన వాళ్లమని చెప్పి మొబైల్ టవర్ను దొంగిలించారు.
జనరేటర్ సెట్, షెల్టర్, స్టెబిలైజర్ అన్ని మాయం చేశారు. వారు వెంట తెచ్చుకున్న వాహనంలో దోచిదంతా వేసుకుని తుర్రుమన్నారు. కొన్ని రోజుల తర్వాత టవర్ పనుల నిమిత్తం వచ్చిన అధికారులు అక్కడకు వెళ్లగా.. అది కనిపించలేదు. అక్కడి వారందరినీ అడగ్గా..ఇటీవలే మీ కంపెనీ వాళ్లు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పడంతో గుడ్లు తేలేశారట వాళ్లు. దీంతో పోలీసులను ఆశ్రయించారు కంపెనీ అధికారులు. నెల క్రితం వచ్చి మొబైల్ టవర్ పనిచేయడం లేదని, అందుకే దాన్ని తొలగిస్తున్నామని ఆ టవర్ ఉంచిన భూ యజమాని మనీషా కుమారి పోలీసులకు చెప్పారు. ముజఫర్పూర్ పోలీసులకు ఈ దొంగతనం సవాల్గా మారింది. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి.. సీరియస్గా దర్యాప్తు ప్రారంభించారు.