మనిషి జీవితంలో రెండు కీలక ఘట్టాలు ఉంటాయి. అవి చావు, పుట్టక. నిజానికి ఈ రెండు కూడా మన చేతుల్లో ఉండవు. అయితే.., చనిపోయియిన తరువాత పూడ్చడానికి ఓ 6 అడుగుల స్థలం కూడా లేకుంటే ఎలా? ఇంతకన్నా దారుణం ఉంటుందా? అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు గ్రామస్థులకు ఇప్పుడు ఇలాంటి సమస్యే ఎదురైంది. అయితే.., దీనికి కారణం మాత్రం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే. దీంతో.., గ్రామస్థులు శవాన్ని తీసుకుని నేరుగా తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాకి దిగారు.
అనంతపురం జిల్లా లేపాక్షి మండలం కొండూరు వాసులకు ఓ స్మశాన వాటిక ఉంది. గత 80 ఏళ్లుగా ఆ గ్రామస్థులు చనిపోయిన వారికి ఇక్కడే అంత్యక్రియలు చేస్తూ వస్తున్నారు. అయితే.., గత రాత్రి ఆ గ్రామంలో కొండప్ప అనే వ్యక్తి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు శవాన్ని తీసుకుని స్మశానానికి వెళ్ళగా.., అక్కడ కొంత మంది వీరిని అడ్డుకున్నారు. ఈ స్థలం మాది.., ఇక్కడ అంత్యక్రియలు జరపడానికి వీలు లేదు అంటూ అడ్డుకున్నారు.
80 ఏళ్లగా గ్రామం వాడుకుంటున్న స్మశానవాటిక మీది అంటే ఎలా నమ్మాలని గ్రామస్థులు వారిని నిలదీశారు. అయితే.., సదురు వ్యక్తులు అందుకు సంబంధించిన పట్టాలు చూపించడంతో అవాక్కవ్వడం గ్రామస్థుల వంతు అయ్యింది. తాసిల్దార్ కార్యాలయం అధికారులు ఈ పట్టాలు అందించడంతో గ్రామస్థులు అంతా ఆ శవాన్ని తీసుకెళ్లి.. తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నాకి దిగారు. ఈ సమయంలో వారు పోలీసుల హెచ్చరికలను సైతం లెక్క చేయలేదు. “ఆ స్థలం వారిదైతే, మరి మా స్మశానవాటిక ఏది”? అంటూ అధికారులను నిలదీశారు. దీంతో.., ఖంగుతినడం అధికారుల వంతు అయ్యింది. అయితే.., గతంలో పని చేసిన ఓ తాసిల్దార్ కారణంగానే ఈ సమస్య వచ్చినట్టు తెలుస్తోంది. మరి.. చూశారు కదా? ఈ విషయంలో తప్పు ఎవరిదని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.