న్యూ ఢిల్లీ- ఏ క్షణమైనా కరోనా మహమ్మారి మళ్లీ విజృంబించే ప్రమాదం ఉందని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాస్త్రీయ సమాజం సిద్ధంగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. డిఐపిఏఎస్ కు చెందిన సుమారు 25 మంది శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులను సోమవారం ఉపరాష్ట్రపతి తమ నివాసానికి ఆహ్వానించారు. వారిలో డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి కూడా ఉన్నారు.
కరోనా చికిత్స, నిర్వహణ కోసం వివిధ స్వదేశీ ఉత్పత్తులను అభివృద్ధి చేసిన డిఐపిఏఎస్, ఇతర డిఆర్డిఓ ల్యాబ్లను ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ సందర్బంగా ప్రత్యేకంగా అభినందించారు. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో డిఆర్డిఓ కు చెందిన డిఫెన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ, అలైడ్ సైన్సెస్ కు చెందిన శాస్త్రవేత్తలు, ముందు వరుస యోధుల సహకారం అభినందనీయమని ఉపరాష్ట్రపతి అన్నారు.
భవిష్యత్తులో ఎదురు కాబోయే మరిన్ని మహమ్మారులను ఎదుర్కొనే దిశగా వారి పరిశోధనలను మరింత సమర్థవంతంగా ముమ్మరం చేయాలని దిశానిర్ధేశం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా గతంలో ఎన్నడూ చూడని ఆరోగ్య సంక్షోభం ఎదురైందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది జీవితాలు, వారి జీవనోపాధులు ప్రతికూలంగా ప్రభావితం అయ్యాయని వెంకయ్య నాయుడు అన్నారు.
ఈ సందర్బంగా కరోనా చికిత్స, నిర్వహణ కోసం డిఆర్డిఓ ల్యాబ్స్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చెందిన వివిధ ఉత్పత్తులు, పరికరాల గురించి చైర్మెన్ డాక్టర్ సతీష్ రెడ్డి, వెంకయ్య నాయుడుకు వివరించారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులను ఆహ్వానించి తమ అభిప్రాయాలు, ఆలోచనలను వారితో పంచుకున్నందుకు ఉపరాష్ట్రపతికి సతీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.