క్రైం డెస్క్- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుటుంబ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు వనమా రాఘవ బెదిరింపుల కారణంగా రామకృష్ణ ఈ నెల 3న తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోలు పోసి నిప్పంటించి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగురాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడైన వనమా రాఘవేంద్రరావు అలియాస్ రాఘవను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న రాఘవను శుక్రవారం రాత్రి పోలుసులు అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఏ2గా ఉన్న రాఘవ, ఘటన జరిగిన రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
దీంతో పోలీసు ప్రత్యేక టీంలు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. వనమా రాఘవ ఈనెల 3 నుంచి తొర్రూరు, హైదరాబాద్, సూర్యాపేట, చీరాల, విశాఖపట్నం, రాజమండ్రికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సిమ్ కార్డును మార్చుతూ పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకున్నాడు. విశాఖపట్నంలో రెండు రోజులపాటు తలదాచుకున్న రాఘవ శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు వద్ద పోలీసులకు చిక్కాడు.
భద్రాద్రి జిల్లా అదనపు ఎస్పీ కేఆర్కే ప్రసాద్ రావ్ ఆధ్వర్యంలో రాఘవను అదుపులోకి తీసుకుని పాల్వంచ ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. వనమా రాఘవతో పాటు పాల్వంచ మండలానికి చెందిన ముక్తేవి గిరీశ్, మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో వారిని పాల్వంచ తీసుకొచ్చి విచారించినట్లు తెలిపిన ఎస్పీ సునీల్దత్, కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు.