కరీంనగర్- తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్లకు గాను టీఆర్ఎస్కు 503 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 159 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 35 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 14 ఓట్లు పోలయ్యాయి.
మొత్తం 22 రౌండ్లలో హుజరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాలలో రెండు రూముల్లో 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తున్నారు. ఒక్కో రౌండ్కు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం 22 రౌండ్ల ఓట్ల లెక్కింపుకు పూర్తయ్యే సరికి సాయంత్రం 4 గంటలు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ బరిలో నిలిచారు. గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేపధ్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కళాశాల ముందు నుంచి వెళ్లే రోడ్డులో ట్రాఫిక్ ను కూడా దారి మళ్లిస్తున్నారు.
ఉప ఎన్నికల ఫలితాల తరువాత గెలిచిన అభ్యర్ది విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని ఎన్నికల సంఘం ఆదేశించింది. గెలుపుకు సంబందించిన సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్ధితో పాటు ఒక్కరు మాత్రమే రావాలని సూచించింది.