అలిపిరి- తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. దేశం నలుమూల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తుంటారు. కలియుగదైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటే సకల పాపాలు హరించుకుపోయి, మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాడ విశ్వాసం. ఇక తిరుమల శ్రీవారు ఎంత ఫేమస్సో, అక్కడి లడ్డూ ప్రసాదం కూడా అంతే ఫేమస్ అని చెప్పవచ్చు. తిరుమల లడ్డుకు ఉన్న రుచి ప్రపంచంలో మరెక్కడా ఉండదని అంటారు.
ఇక అసలు విషయానికి వస్తే.. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఝలక్ ఇచ్చింది. శ్రీవారి ప్రసాదాల్లో ప్రత్యేకమైన జిలేబి, మురుకు సెట్ ధరను భారీగా పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఒక జిలేబి, ఒక మురుకుతో కూడిన సెట్ ధర వంద రూపాయలు ఉండగా, దాన్ని ఒక్కసారిగా 500ల రూపాయలకు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
శ్రీవారి ఆలయంలో ప్రతి గురువారం నిర్వహించే తిరుప్పావై సేవలో స్వామివారికి జిలేబి, మురుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ సేవలో పాల్గొన్న భక్తులకు మాత్రమే ఈ ప్రసాదాన్ని అందజేస్తారు. ప్రతి వారం 7 నుంచి 8 పడుల జిలేబి, మురుకుల ప్రసాదాన్ని తయారు చేస్తారు. ఒక పడికి 51 జిలేబీలు, 51 మురుకులు తయారవుతాయి. తిరుప్పావై సేవలో పాల్గొన్న భక్తులకు అందించగా మిగిలిన ప్రసాదాన్ని టీటీడీ అధికారులకు, ఉద్యోగులకు, పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు సిఫారసు లేఖలపై ఒఖ సెట్ను వంద రూపాయలకు అందించేవారు.
ఇప్పుడు ఈ ధరను వంద రూపాయల నుంచి ఏకంగా 500ల రూపాయలకు పెంచాలని గత నెలలో జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి విడుదల చేశారు. టీటీడీ నిర్ణయంపై శ్రీవారి భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.