తూర్పుగోదావరి- వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి పెద్దలు ఒప్పుకోరన్న అనుమానంతోో ఇద్దరు కలిసి పారిపోయారు. ఇంకేముంది రెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేసేవరకు వచ్చింది వ్యవహారం. ఇప్పుడు ఆ ఉర్లో ఎటు చూసినా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గండేపల్లి మండలం ఉప్పలపాడుకు చెందిన యువకుడు, సీతానగరం మండలం ఇనుగంటివారిపేటకు చెందిన అమ్మాయి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అమ్మాయి అమ్మమ్మ ఊరు ఉప్పలపాడు కావడంతో అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఉప్పలపాడులో ఉంటున్న అబ్బాయితో పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది.
మొన్న సంక్రాంతి పండగకు అమ్మాయి ఉప్పలపాడు వచ్చి అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉంటుంది. ఈ క్రమంలో ఈ నెల 27వ తేదీ ప్రేమ జంట పారిపోవడంతో, అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి తండ్రిపై దాడి చేశారు. తమ అమ్మాయిని మీ అబ్బాయే తీసుకెళ్లాడంటూ అతన్ని తీవ్రంగా కొట్టారు. అమ్మాయి కుటుంబ సభ్యుల దాడిలో తీవ్రగాయాలైన అబ్బాయి తండ్రిని ఆస్పత్రికి తరలించారు.
రెండు కుటుంబాల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరిగి ఉప్పలపాడు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పికెట్ ఏర్పాటు చేసి గ్రామంలో పహారా కాస్తున్నారు. మరోవైపు ప్రేమికుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మొత్తానికి పిల్లల ప్రేమ, మా ఊరి చావుకొచ్చిందని అనుకుంటున్నారు గ్రామస్తులు.