హైదరాబాద్- ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల విచారణ సందర్బంగా ఆయన తరపు న్యాయవాదిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న కేసుల విచారణలో వాయిదా కోరితే రోజుకు 50 వేలు ఖర్చుల కింద చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
వైఎస్ జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై ఉన్న కేసులను కొట్టివేయాలన్న పిటిషన్లపై జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గురువారం విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు మినహాయింపుపై దాఖలు చేసిన పిటిషన్ లలో వాదనలు వినిపించేందుకు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది హాజరుకావాల్సి ఉందని, అందుకని విచారణను ఒక్క రోజు వాయిదా వేయాలని జగన్ తరఫు న్యాయవాది నవీన్ కుమార్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
దీనికి సీఎం వైఎస్ జగన్ తరపు అడ్వకేట్ పై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. ఇకపై కేసులు విచారణకు వచ్చినప్పుడు తప్పకుండా వాదనలు వినిపించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇక ముందు కేసు విచారణపై వాయిదా కోరితే కోర్టు ఖర్చుల కింద హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు రోజుకు 50 వేల చొప్పున చెల్లించేలా ఆదేశాలిస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు.
ఇకపై అలా జరగకుండా చూసుకుంటామని, సకాలంలో విచారణకు సహకరిస్తామని జగన్ తరపు న్యాయవాది హైకోర్టుకు హామీ ఇచ్చారు. తదుపరి విచారణను ఈనెల 22వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే జాబితా వారీగా కేసు విచారణకు పిలవగా దాల్మియా సిమెంట్స్కు చెందిన పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు వినిపించడానికి న్యాయవాది గడువు కోరారు.