ఫిల్మ్ డెస్క్- స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప మరికాసేపట్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది. అల్లు అర్జున్, మాస్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తం రెండు పార్టులుగా రాబోతున్న పుష్ప మూవీ నుంచి, మొదటి భాగం పుష్ప- ది రైజ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
దేశ వ్యాప్తంగా ఏడు భాషల్లో పుష్ప మూవీ విడుదల నేపధ్యంలో అల్లువారి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా, సునీల్, అనసూయలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప మూవీ మేకర్స్ కు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది.
పుష్ప సినిమా కోసం 5వ షో ప్రత్యేక ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 17వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పుష్ప సినిమా అదనపు షో ప్రదర్శించుకోవచ్చని తెలంగాణ సర్కార్ తెలిపింది. అంతే కాదు 50 రూపాయల టికెట్ల పెంపుపై కూడా డిస్ట్రిబ్యూటర్లకు తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పుష్ప మేకర్స్ తక్కువ సమయంలోనే మంచి వసూళ్లు రాబట్టడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తుండటంతో, ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు పుష్ప 5 షోలతో రిజార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టడం ఖాయమని ఫిల్మి నగర్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల పుష్ప మేకర్స్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు హర్షం వ్కక్తం చేస్తున్నారు.