దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. ఈరోజు ఉన్న వారు.. రేపు ఉంటారో, లేదో అన్న రీతిలో పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ప్రభుత్వాలు సైతం చేతులు ఎత్తేస్తున్నాయి. కానీ.., ఒకే ఒక వ్యక్తి మాత్రం సాయం అన్న ప్రతి ఒక్కరికి తన ఆపన్న హస్తం అందిస్తున్నాడు. బాధల్లో ఉన్న వారికి, ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బతుకుతున్న వారికి నేనున్నానంటూ భరోసా అందిస్తున్నాడు. ఆయనే రియల్ హీరో సోనూసూద్. కరోనా మొదటి వేవ్ లో వలస కార్మికుల కోసం సోనూ చేసిన సహాయక చర్యలు దేశంలో ఎవ్వరూ మరచిపోలేరు. కానీ.., సెకండ్ వేవ్ పరిస్థితి అది కాదు. ఈసారి ఆక్సిజన్ అందక ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వైరస్ దెబ్బకి హాస్పిటల్స్ మాత్రమే కాదు.., స్మశానాల్లో కూడా క్యూ లైన్స్ తప్పడం లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు సోనూసూద్. ఇందులో భాగంగానే మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు సోను భాయ్.
కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని సోనూసూద్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి ఓ ప్లాంట్కు ఆర్డర్ చేశామని, మరో 10-12 రోజుల్లో అక్కడి నుంచి ఆక్సిజన్ ప్లాంట్ రాబోతున్నట్లు సోనూసూద్ తెలిపారు. అలాగే ఇంకొన్ని దేశాల నుంచి ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సోనూ ప్రకటించారు. ప్రస్తుతం సమయం అనేది పెద్ద సవాలుగా మారింది.. ప్రతీది సమయానికి అందించేలా మా వంతు కృషి చేస్తున్నాము. ఇక మన ప్రాణాలు కాపాడుకోగలం అని సోనూసూద్ ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశాడు. అయితే.., కరోనా థర్డ్ వేవ్ లో ఇంకా ఆక్సిజన్ అవసరం ఎక్కువ ఉంటుందన్న ఆలోచనతో సోనూ ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ సంఖ్య ఇంకా పెంచే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే.. సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు సోను అందరికీ సహాయం చేస్తున్నాడు. దీనితో.. ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ సోనూ ఒక్కడే చేస్తున్నాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండటం విశేషం.